సాధారణంగా వ్యవస్థలు ప్రైవేటు పరం అయితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని చాలా మంది నేతలు భావిస్తుంటారు. వారి లక్ష్యం నిజంగా రాష్ట్రాభివృద్ధేనా.. లేక, వ్యక్తిగతాభివృద్ధా అనేది సమాధానం దొరకనంత పెద్ద ప్రశ్నేమీకాదు.
వాస్తవానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు.. పాలకులను ఎన్నుకునేది.. వారి సమర్థత, నాయకత్వ లక్షణాలు మొదలైనవాటిపై నమ్మకంతోనే! అయితే… అధికారంలోకి వచ్చిన తర్వాత వారు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా, ప్రైవేటు కంపెనీ సీఈఓలుగా మారి ప్రవర్తిస్తే… ప్రభుత్వ ఫలాలు, స్థలాలు వారికి అందని ద్రాక్షలా మారిపోవా..? ఒకవేళ అందేటంత ఎత్తులోనే ఉన్నా.. ఉచితంగా అందవు కదా..?
సాధారణంగా కొంతమంది పాలకులు… ప్రభుత్వ ఆస్తులు అంటే అది ప్రజల సొమ్ము అని కాకుండా.. దానికి తాము పెత్తందారులం అని, ఒక్కసారి ప్రజలు తమను నమ్మి ఓటు వేసి అందలం ఎక్కిస్తే.. ఇక అన్నీ తామే అని భావిస్తుంటారు.. తాము కిరీటం లేని రాజులమని భ్రమిస్తుంటారు!
అదే ప్రజలకు ఆగ్రహం వచ్చి పక్క పార్టీకి ఓ ఓటు గుద్దితే.. వీరి కూసాలు కదిలి, పాతాళానికి పడిపోతారు. చిత్రంగా.. అప్పటికి తత్వం బోధపడుతుందో ఏమో కానీ.. వారికి ఉన్నఫలంగా ప్రజలు, వారి హక్కులు, గుర్తుకు వస్తుంటాయి. ఇది ప్రజాస్వామ్యంలో నిత్యకృత్యంగా ఉన్న పరిస్థితి!
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే… గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను గతంలో ఎన్నడూ లేని రీతిలో అన్నట్లుగా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ప్రశంసలు దక్కాయి. వైద్యంతో పాటు వైద్య విద్య పేదవాడికి అందుబాటులోకి వస్తుందనే చర్చా నడిచింది.
కట్ చేస్తే… కూటమి ప్రభుత్వ వాటిని ‘పీపీపీ’ ల పేరు చెప్పి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది. అంటే… ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ వ్యవస్థలను, ప్రభుత్వం ఇచ్చే జీతంతో ప్రైవేటు వ్యక్తులు రన్ చేస్తారన్నమాట. దీన్ని వీలైనంత స్పష్టంగా జగన్ జనాల్లోకి తీసుకెళ్లారు.
అదే ఊపులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కార్యక్రమానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు.
దీనికి రాష్ట్ర ప్రజల నుంచి ఊచిందినదానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని, కోటి సంతకాలు అని పిలుపునిస్తే అంతకు మించి రెస్పాండ్ అయ్యారని వైసీపీ నేతలు చెప్పారు. ఆ పత్రాలను గవర్నర్ కు అందజేశారు. దీంతో… వీటిపై ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యాలు ముందడుగు వేయలేదు! ఇది కచ్చితంగా ప్రజా విజయమే!
ఇప్పుడు ఆ టాపిక్ కాస్తా సద్దుమణిగింది. ఈ గ్యాప్ లో తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో జీవీఎంసీకి పెద్ద ఎత్తున ఉన్న ఆస్తులను 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేయాలని నిర్ణయించింది. దీనిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇలా చేయడం వల్ల నగర పాలక సంస్గ్థకు నగదు భారీగా వస్తుందని పెద్దలు ఏమార్చే ప్రయత్నం చేయడం సంగతి కాసేపు పక్కనపెడితే… ప్రభుత్వం వద్ద ఉండాల్సిన వాటిని ప్రైవేట్ వారికి ఇస్తే ప్రజలు వాటిని స్వేచ్ఛగా ఉపయోగించుకునే అవకాశాన్ని కోల్పోతారనేది ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. మేధావులు గుర్తు చేస్తున్న అంశం.
అయితే జీవీఎంసీ మాత్రం విశాఖ నగరంలోని స్థలాలు, భవనాలు, పార్కులు, స్టేడియంలు ఇలా అన్నీ లీజుకు ఇచ్చేసింది. ఇందులో భాగంగా.. సుమారు ఆరు వందల ఎకరాల భూములు, 940 దుకాణాలు పీపీపీ పేరుతో 99 ఏళ్లకు లీజుకు వెళ్లిపోయాయని తెలుస్తోంది. ఇది ప్రజా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే చర్యగా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఏపీలో ప్రభుత్వం పీపీపీ పేరు చెప్పి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వెక్కి లాక్కుని, చర్యలు తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో జగన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
దీంతో… ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటు వ్యక్తులు ముందుకు వచ్చే సాహసం చేయలేదు! మరి ఆ హెచ్చరికలు జీవీఎంసీలో 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నవారు మరిచిపోయారా.. లేక, లైట్ తీసుకున్నారా అనేది తాజాగా చర్చనీయాంశంగా మారింది.
