ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. అంటే జమిలీ ఎన్నికల టాపిక్ లేకపోతే.. ఏపీలో సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందన్నమాట. అయితే.. మరో ఏడాదిలోనే ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకు గల ప్రధాన కారణాల్లో జగన్ ప్రకటించిన పాదయాత్ర కూడా ఒకటి. ఈ సమయంలో 2029 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ అజెండాపై ఆసక్తికర చర్చ మొదలైంది.
అవును… 2019 ఎన్నికల్లో ఏ స్థాయిలో అయితే విజయఢంకా మోగించామో, అంతకు మించిన విజయాన్ని 2029లో నమోదు చేయాలని వైసీపీ బలంగా కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. పైగా.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు అన్నీ తొలి ఏడాదిలోనే అడియాశలయ్యాయని.. సూపర్ సిక్స్ అని చెప్పి చేసిన మోసాలపై జనం ఆగ్రహంగా ఉన్నారని.. ప్రధానంగా మహిళలు, యువత కూటమి ప్రభుత్వంపై పీకల్లోతు కోపంతో ఉన్నారని వైసీపీ బలంగా నమ్ముతోంది. ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది!
ఎందుకంటే… తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 అంటూ బాబు ఇచ్చిన హామీలను మహిళాలోకంతో పాటు యువత బలంగా నమ్మారు. వాలంటీర్లకు రెట్టింపు జీతాలు అనే హామీ కూడా జనాల్లోకి తీవ్రంగానే చొచ్చుకుపోయింది.
కట్ చేస్తే… అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలకు కండిషన్స్ తో మెలికలు పెడితే, మరికొన్ని హామీల ఊసే లేకుండా చంద్రబాబు పాలన సాగిస్తుండగా.. ప్రశ్నిస్తానన్నవారు మౌనంగా ఉండిపోయారు.
ఆ హామీల సంగతి అలా ఉంటే… చంద్రబాబుని నమ్మిన ఓ వర్గం ప్రజానికం, ఎంతో ఆశలు పెట్టుకున్న విషయం ‘అమరావతి నిర్మాణం పూర్తి చేయడం’. ఈ విషయంలో వాస్తవంగా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది! పైగా మరో 50 వేల ఎకరాల సేకరణ అనే ప్రకటనపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇది ఇప్పట్లో అయ్యే పనిలా కనిపించడం లేదని మేధావులు చెప్పకనే చెబుతున్నారు. దీంతో.. ఆ అమరావతే చంద్రబాబుకు అతిపెద్ద శాపంగా మారే అవకాశాలున్నాయి.
దీనికి తోడు సీఆర్డీయే పరిధిలోనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ 110 కిమీ పరిధిలో మావిగన్ అంశాన్ని జగన్ తెరపైకి తేవడం.. దీంతో కక్కలేక మింగలేక టీడీపీ నేతలు ఇబ్బందిపడుతున్నారనే చర్చ జరగడం కూడా వైసీపీకి బలంగా మారనుందని చెప్పొచ్చు. దీంతో.. జగన్ పాదయాత్రలో, వైసీపీ 2029 ఎన్నికల అజెండాలో ఈ అంశం కీలక భూమిక పోషించే అవకాశం ఉంది.
పైగా సామాజికవర్గాల వారీగా కూడా మావిగన్ సమన్యాయం చేసే అవకాశం ఉందనే చర్చ ఆయా ప్రాంతాల్లో మొదలైంది. ఉదాహరణకు అమరావతిలో ప్రధానంగా ఒక సామాజికవర్గ అభివృద్ధే ధ్యేయంగా తెర వెనుక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఒకరంటే… మావిగన్ తో ఇతర సామాజికవర్గాలకు సరైన మేలు జరుగుతుందని.. ఇందులో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అనే తేడాలు లేకుండా కాపు సామాజికవర్గానికి కూడా మేలు జరగనుందని అంటున్నారు.
పైగా.. జనసేన అధినేత పవన్ ను నమ్మిన పలువురు కాపు నాయకులు తీవ్ర మనోవేధనతో ఉన్నారు. ప్రధానంగా మరో 15 ఏళ్లు కూటమి జెండాలు మోయాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేయడాన్ని.. తనను నమ్మిన ఆ సామాజికవర్గ ప్రజానికం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో… వారికి వైసీపీ నుంచి పూర్తి ఆదరణ దక్కే అవకాశం ఉందని.. ముద్రగడ లాంటి నేతల మద్దతు, భరోసా ఉంటుందని చెబుతున్నారు.
ఇదే క్రమంలో ఏపీలో టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీస్టియన్, ముస్లిం మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయనే చర్చ బలంగా జరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారని చెబుతూనే.. వారంతా అనధికారిక క్రైస్తవులు, ఎస్సీలు అన్నట్లుగా ఆ సామాజికవర్గాన్ని, దళిత క్రైస్తవులను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు.
ఉదాహరణకు… ఉండి నియోజకవర్గంలో చర్చిలపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఏ విధంగా టార్గెట్ చేసింది లోకమంతా చూసిన పరిస్థితి. ఆ ప్రాంతంలో అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న హిందు – క్రైస్తవుల మధ్య ఆయన పసుపు గోడ కడుతున్నారనే చర్చా నడిచింది.
అయితే ఈ విషయంలో ట్రిపుల్ ఆర్ ని కంట్రోల్ చేయకుండా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లుగా.. చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటించడం కూడా గ్రౌండ్ లెవెల్లో కూటమికి ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసిందనేది పరిశీలకుల మాటగా ఉంది.
వాస్తవానికి ఎస్సీలు, క్రైస్తవులు ఎక్కువగా జగన్ వైపే ఉన్నారనేది తెలిసిన విషయమే! కాకపోతే 2024 ఎన్నికల సమయంలో కారణాలు ఏవైనప్పటికీ.. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలను గరిష్టంగా కూటమే గెలుచుకుంది. అయితే… తాజా పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎస్సీ, ఎస్టీ, క్రీస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంక్ పూర్తిగా ఫ్యాన్ కిందకు చేరే అవకాశాలున్నాయి.
ఈ విధంగా కూటమి ఇచ్చిన హామీలపై చేతులెత్తేసిన వైనం.. అందరికీ న్యాయం చేసేలా ఎత్తుకున్న మావిగన్ అంశం.. పవన్ మరిచిన, చంద్రబాబు వదిలేసిన కాపులకు అండగా ఉండటం.. కూటమి పాలనలో ఇబ్బంది పడుతున్న క్రీస్టియన్ మైనారిటీ ప్రజానికానికి పూర్తి భరోసా కల్పించడం.. మొదలైనటువంటి వ్యూహాలతో వైసీపీ ముందుకు కదలనుందని తెలుస్తోంది.
