వివేకాలో కేసులో భారీ ట్విస్ట్.. 8 కోట్లంటూ తెరపైకి రెండో భార్య!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారడంతోపాటు… రోజుకో రకం ట్విస్టులతో సాగుతున్న వివేకా మర్డర్ కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది. ఇన్నాళ్లుగా ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో కూడా తెలియ‌ని.. వివేకా రెండో భార్య‌ షేక్ షమీం సడెన్‌ గా తెరపైకి వచ్చారు. రావడమే కాదు.. సంచలన ఆరోపణలు కూడా చేశారు. దీంతో… కొత్త కొత్త విషయాలు అధికారికంగా వెలుగులోకి వస్తున్నాయి!

అవును… మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. వరుసపెట్టి అరెస్టులు, విచారణలు జరుగుతున్న తరుణంలో… ఆయన రెండో భార్య షేక్ షమీం తెరపైకి వచ్చారు. వివేకాతో 2010లో తనకు వివాహం అయ్యిందని.. 2011లో మరోసారి వివాహం చేసుకున్నామని షమీం చెబుతున్నారు. ఈ క్రమంలో… 2015లో తమకు కుమారుడు షహన్షాన్ పుట్టినట్లు తెలిపారు. హత్యకు కొన్ని గంటల ముందు కూడా వివేక తనతో ఫోన్‌ లో మాట్లాడినట్లు షమీం సంచలన ప్రకటన చేశారు.

ఇదే క్రమంలో… తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపిన ఆమె… వివేకా బామ్మర్ది, అల్లుడి అన్న అయిన నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తనను, తన కుటుంబ సభ్యుల్ని ఎన్నోసార్లు వేదించారని, బెదిరించారని.. వివేకాకు దూరంగా ఉండమని సునీతా రెడ్డి సైతం హెచ్చరించేదని షమీం వెల్లడించారు. అదేవిధంగా… వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌ కు, వివేకా పదవిపై శివప్రకాశ్ రెడ్డికి కాంక్ష ఉండేదని కీలక వ్యాఖ్యలు చేశారు షమీం!

ఈ క్రమంలో మరిన్ని కీలక విషయాలు వెళ్లడించిన ఆమె… బెంగుళూరు ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా 8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పారని.. హత్యకు కొన్ని గంటల ముందు కూడా 8 కోట్లు గురించి ఆయన తనతో మాట్లాడారని ఆమె తెలిపారు. చనిపోయిన తరువాత వివేకా ఇంటికి వెళ్దామనుకున్నప్పటికీ.. శివ ప్రకాష్ రెడ్డి మీద ఉన్న భయంతో అటు వైపు వెళ్లలేకపోయానని షమీం వెల్లడించారు. దీంతో… వివేకా హత్య కేసులో కీలకపరిణామం చోటు చేసుకుందని అంటున్నారు విశ్లేషకులు.