Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలి: ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారిని సమీపంలోని మెరుగైన ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందించాలని కోరారు.

సమగ్ర విచారణకు డిమాండ్: ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. “రోడ్డు భద్రతా ప్రమాణాలను అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి” అని ఆయన సూచించారు. బాధితులకు అన్ని విధాలా అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు.

