మంగళగిరిలో పోటీ చేస్తున్న నారావారి పుత్రరత్నం నారా లోకేష్ కు ఎక్కడికక్కగ చుక్కెదురవుతోంది. ప్రచారం కోసం నియోజకవర్గంలో తిరుగుతున్న లోకేష్ ను జనాలు బాగా నిలదీస్తున్నారు. వివిధ సమస్యలపై తనను నిలదీస్తున్న జనాలకు సమాధానం చెప్పలేక లోకేష్ నీళ్ళు నములుతున్నారు.
డ్వాక్రా రుణమాఫీ జరగలేదని డ్వాక్రా మహిళలు, రైతు రుణమాఫీ అందలేదని రైతులు, నిరుద్యోగ భృతి రాలేదని యువకులు ఇలా పలుచోట్ల లోకేష్ కు నిలదీతలే ఎదురవుతున్నాయి. ఇలాంటి నేపధ్యంలో స్వర్ణకారులు కూడా నిలదీశారు. గడచిన ఐదేళ్ళల్లో తమ సమస్యల్లో ఏ ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం పట్టంచుకోలేదని చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించని మీకు తామెందుకు ఓట్లేయాలంటూ నిలదీశారు.
తమ సమస్యలను చెప్పుకుందామని తాము వచ్చినా తమనెవరూ పట్టించుకోలేదని నిష్టూరంగా చెప్పారు. తమను బాగా తిప్పించుకున్నారే కానీ సమస్యలను ఎవరూ వినలేదన్నారు. కాబట్టి ఓట్లేయాల్సిన అవసరం లేదన్నట్లుగా యువకుడు తేల్చేశాడు. దాంతో లోకేష్ కు ఏం చెప్పాలో తోచక నేను చెప్పేది విను అంటూ ఏదో డొంకతిరుగుడుగా మాట్లాడేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
