TDP 44th Anniversary: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో జరిగిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అసలేం జరిగింది?
చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉత్సాహంగా జెండాను పైకి ఎగురవేయగా.. అది తలకిందులుగా ఉండటాన్ని నేతలు గమనించారు. కట్టే సమయంలో సరిగా చూసుకోకపోవడంతో చక్రం గుర్తు కిందికి వచ్చేలా జెండా ఎగిరింది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, ఆ పొరపాటును సరిదిద్ది తిరిగి జెండాను గౌరవప్రదంగా ఆవిష్కరించారు.
కానీ, అప్పటికే ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అవ్వడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. “కనీసం జెండా ఎలా ఉందో చూసుకోరా?” అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
టీడీపీ బలంగా ఉంటేనే రాష్ట్రం బలం: చంద్రబాబు
మరోవైపు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సవాళ్ల ప్రయాణం: 44 ఏళ్లలో టీడీపీ ఎన్నో సంక్షోభాలను తట్టుకుని నిలబడిందని, కుట్రలు చేసేవారు పార్టీని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
కార్యకర్తలే ప్రాణం: పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న, త్యాగాలు చేసిన కార్యకర్తలకు అండగా ఉంటామని, వారిని విస్మరిస్తే పార్టీకి ప్రమాదమని నేతలను హెచ్చరించారు.
భవిష్యత్తు లక్ష్యం: రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ జెండా ఎగరాలని, ఏపీ బలంగా ఉండాలంటే టీడీపీ బలంగా ఉండాలని ఉద్ఘాటించారు.
రాబోయే రోజుల్లో సీట్ల పెంపు?
ఈ వేదికగా చంద్రబాబు ఒక కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అసెంబ్లీ సీట్ల సంఖ్య 50 శాతం పెరిగే అవకాశం ఉందని, ఈ మూడేళ్లలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. “పని చేసే వారిని గుర్తించే బాధ్యత లోకేష్ది అయితే.. వారికి అవకాశం కల్పించే బాధ్యత నాది” అని క్లారిటీ ఇచ్చారు.

