శ్రీవారి పింక్ డైమండ్ వివాదం .. మళ్లీ విచార‌ణ అవ‌స‌రం లేదన్న హైకోర్టు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి చెందిన పింక్‌ డైమండ్‌ విషయంలో మ‌రోసారి విచారణ అవ‌స‌రం లేద‌ని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపించాలంటూ వ‌చ్చిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో జోక్యానికి నిరాకరించింది. పింక్‌ డైమండ్‌ విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు కమిటీలు రెండు నివేదికలు ఇచ్చాయని, అందువల్ల దీనిపై మళ్లీ విచారణకు ఆదేశించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్ ‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

కాగా, పింక్‌ డైమండ్‌ విషయంలో విచారణకు ఆదేశించాలని టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, మాజీ ఈవోలు ఐవైఆర్‌ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. దీనిపైనే విచార‌ణ జ‌రిపిన హైకోర్టు త‌న నిర్ణయాన్ని వెల్లడించింది. సాయిరెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది.