బ్రేకింగ్ న్యూస్… ఐ.టి విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విచారణ నిమిత్తం బషీర్ బాగ్ లోని ఐటి కార్యాలయంలో హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి, ఉదయ్, సెబాస్టియన్లు కూడా విచారణకు హాజరుకానున్నారు. ఓటుకు నోటు కేసులోనే రేవంత్ ను అధికారులు ప్రధానంగా ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే రేవంత్ ఇంటి పై అధికారులు దాడులు చేసి పలు పత్రాలు, నగదు, లాకర్లు స్వాధీనం చేసుకున్నారు.

రేవంత్ విచారణకు హాజరు కావడంతో రేవంత్ అనుచరులు, కార్యకర్తలు ఐటి కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. రేవంత్ అనుచరుల తాకిడితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ ను ఎంత సేపు విచారించనున్నారు, అతనిని ఏం ప్రశ్నించనున్నారో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

రేవంత్ రెడ్డి అక్రమాస్తులు కలిగి ఉన్నాడని లాయర్ రామారావు చేసిన ఫిర్యాదుతో అధికారులు రేవంత్ ఇంటి పై దాడులు చేశారు. రేవంత్ కంపెనీలకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ ఆదాయ వ్యయాలను అధికారులు ప్రశ్నించారు. తక్కువ కాలంలోనే ఇంత ఆస్తులు ఎలా సంపాదించారనే కోణంలోనే రేవంత్ పై విచారణ సాగనున్నట్టుగా తెలుస్తోంది.