కడప స్టీల్ ప్లాంట్ ఉత్తర ప్రత్యుత్తరాలు బయటపెట్టాల్సిందే…

(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)

కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలును కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు బహిర్గతం చేయాల్సిన సమయం వచ్చింది.

విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కేంద్రం చేయాలి. కేంద్రం చేయని కారణంగా రాష్ట్రప్రభుత్వమే నిర్మాణ బాధ్యత తీసుకున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆమేరకు నేడు శంకుస్థాపన కూడా చేసింది. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం మోసం చేసిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకున్నదని రెండు సంవత్సరాలలో 20 వేల కోట్ల రూపాయల తో పూర్తి చేస్తామని చెప్పారు. అదే సమయంలో కేంద్రం కూడా ఈ వ్యవహారం పై స్పందించింది. రాష్ట్రం తగిన రీతిలో స్పందించలేదని , అడిగిన నివేదిక ఇవ్వలేదని పేర్కొంది. రెండు బాధ్యత కలిగిన ప్రభుత్వాలు పరస్పర బిన్నమైన ప్రకటనలు గందరగోళం సృష్టించబడుతున్నాయి. అంతే కాదు అనేక అనుమానాలకు ఆస్కారం కల్పించింది. అందుకే రెండు ప్రభుత్వాలు తమ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను బహిర్గతం చేయాలని రాయలసీమ మేధావుల ఫోరం డిమాండు చేస్తున్నది

విభజన చట్టం 2014 ప్రకారం విభజన తేదీ నుంచి 6 నెలల కాలంలో కడప స్టీల్ ప్లాంట్ సాధ్య సాద్యలను పరిశీలించి నివేదిక ఇవ్వాలి. అంతిమ నిర్ణయం కేంద్రం తీసుకోవాలి. అంటే 2014 డిసెంబర్ నెలలో నివేదిక ఇవ్వాలి కానీ నేటికీ కూడా లీకులు తప్ప వాస్థవాలను బిజెపి , టిడిపి ప్రభుత్వాలు రాయలసీమ ప్రజలకు చెప్పకుండా దాచి పెట్టారు. కేంద్రం సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదికలో చట్టం ప్రకారం పరిశీలించామని లాభదాయకం కాదని కమిటీ చెప్పినట్లు చెప్పారు. 2014 లొనే కేంద్రం నిర్ణయం రాష్ట్రానికి తెలినప్పుడు 4 సంవత్సరాలు ప్రజలకు వాస్థవాలను చెప్పాల్సిన రాష్ట్రం ఎందుకు దాచి పెట్టారో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలి. అదే సమయంలో రాష్ట్రం సమాచారం ఇవ్వడం లేదని కేంద్రం ఇన్నిరోజులు ఎందుకు చెప్పలేదు బీజేపీ నేతలు రాయలసీమ సమాజానికి సమాధానం చెప్పాలి.

బీజేపీ , టిడిపి పార్టీల వ్యవహారం చూస్తుంటే రాజకీయంగా కలిసి ఉన్నపుడు వాస్థవాలను దాచి పెట్టి సీమ ప్రజలను మోసం చేశారన్న విషయం ఇరు పార్టీల స్పందన తీరు బట్టి అర్థం అవుతుంది. ఇప్పటి వరకు నిజాలు చెప్పలేదని అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు చేస్తున్నది , చెపుతున్నది కూడా నిజమని ఎలా నమ్మాలి 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆడుతున్న నాటకమని ఎందుకు అనుకోకూడదు. అందుకే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తమ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను బహిర్గతం చేయాలని రాయలసీమ మేధావుల ఫోరం డిమాండు చేస్తోంది. బీజేపీ , టిడిపి ప్రభుత్వాల నాటకాలకు మోసపోకుండా విభజన చట్టం ప్రకారం కేంద్రంమే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే వరకు రాజకీయాలకు అతీతంగా పోరాడాలి.  

 

(యం. పురుషోత్తమ రెడ్డి,రాయలసీమ మేధావుల ఫోరం, కన్వీనర్. తిరుపతి, ఫోన్ నెంబ 9490493436)