జైపాల్ రెడ్డి మృతికి రాష్ట్రపతి ,ఉపరాష్ట్రపతి , ప్రధాని సంతాపం
కేంద్ర మాజీ మంత్రి ఎస్ . జైపాల్ రెడ్డి హఠాత్తుగా మరణించం పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు . దేశంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్ గా విశిష్ట గౌరవం సంపాదించుకున్న రాజకీయ మేధావి జైపాల్ రెడ్డి ఈరోజు ఉదయం మరణించారు . ఈ వార్త తెలిసి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ప్రధాని నరేంద్ర మోడీ జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు . వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు .
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హైదరాబాద్ జూబిలీహిల్స్ లోని జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా వెంకయ్య జైపాల్ రెడ్డి తో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఇద్దరం ఒకే బెంచి మీద కూర్చొని ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహించామని చెప్పారు . దక్షిణ భారత దేశంలోనే అత్యుత్తమ పార్లమెంటేరియన్ ఎంపికైన జైపాల్ రెడ్డి పరిణితి కలిగిన రాజకీయ నాయకుడని వెంకయ్య చెప్పారు .
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు జైపాల్ రెడ్డి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు పూడ్చలేని లోటని చెప్పారు . తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జైపాల్ రెడ్డి మృతి పార్టీకి ఎంతో నష్టమని , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు . టీఆరెస్ నాయకుడు కేటీఆర్ కూడా జైపాల్ మృతికి సంతాపం తెలిపారు
కాంగ్రెస్ పార్టీ కి చెందిన అనేకమంది నాయకులు జైపాల్ నివాసానికి వెళ్లి కడసారి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు .సోమవారం ఉదయం జైపాల్ రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ భవన్ దగ్గర సందర్శకుల కోసం ఉంచుతారు . తరువాత పి .వి ఘాట్ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి .
