కృష్ణా జిల్లాలో డ్రైవర్ నిర్లక్ష్యం: ముగ్గురు బాలింతలకు అవస్థ

కృష్ణా జిల్లాలో ఒక డ్రైవర్ కారణంగా ముగ్గురు బాలింతలు అవస్థ పడ్డారు. బిడ్డకు జన్మ ఇచ్చి పెద్ద ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది ఒక మహిళ. తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ లో ఇంటికి వస్తుండగా ఇంటికి అరకిలోమీటరు దూరంలోనే బస్సు నుండి దింపేసాడు డ్రైవర్. నడవలేక అవస్థలు పడుతున్న బాలింతను చూసి స్థానికులు బస్సును నిలిపివేశారు. గంటసేపు అలానే నిలిపివేయడంతో వాహనంలో ఉన్న మరో ఇద్దరు బాలింతలు కూడా అవస్థలు పడ్డారు. దీనిపై పూర్తి సమాచారం కింద ఉంది చదవండి.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో జరిగిన ఘటన ఇది . ప్రభుత్వం శిశు మరణాలు నివారించి, పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యశాలల్లో సహజ కాన్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలో ఉయ్యూరు సుందరయ్య నగర్ కు చెందిన చల్లా శ్రీరాములు భార్య శ్రావణికి 2 వ కాన్పు ఇబ్బందిగా మారటంతో కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. కాన్పు కష్టం కావటంతో ఈనెల 12 న పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు.

తల్లీ బిడ్డా క్షేమంగా వుండటంతో మంగళవారం వైద్యులు వారిని డిశ్చార్జ్ చేశారు. వీరిని ఉచితంగా వారి ఇంటివద్ద దించేందుకు ప్రభుత్వం తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ పేరుతో ఉచితంగా సేవలు అందించే కాంట్రాక్టును “జీ వి కె- ఈ ఎం ఆర్ ఐ” సంస్థకు అప్పగించింది. ఈ సంస్థకు చెందిన ap 16 TG 9660 వాహనం లో ముగ్గురు బాలింతలు బయలు దేరారు.

ఉయ్యూరు లో దించ వలసిన శ్రావణి ఇంటికి అర కిలో మీటర్ దూరంలో బాలింత రాలిని బిడ్డను దించి వేసి వెళ్ళి పోవాలని డ్రైవర్ సూచించాడు. ఈ రోడ్డు లో వాహనం వెళ్ళటానికి కుదరదని చెప్పాడు. దిగి వెళ్ళటానికి ప్రయత్నించిన బాధితురాలి అవస్థ చూసిన స్థానికులు రోడ్డుపై ట్రాక్టర్లు, లారీ లు వెళుతుంటే నీ చిన్ని వాహనం ఎందుకు వెళ్ళదు అని ప్రశ్నించారు.

డ్రైవర్ మొండి పట్టుదల వీడకపోవటం తో జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకు వెళ్ళారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాలు సైతం డ్రైవర్ పట్టించుకోక పోవటం తో పాటు వాహనంలో వున్న మరో ఇరువురు బాలింత లు పడుతున్న ఇబ్బంది, స్థానికుల ఆందోళన సమాచారం అందుకున్న ఉయ్యూరు పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహన డ్రైవర్ కి నచ్చ జెప్పి బాలింత రాలిని ఇంటి వద్ద దింపించారు. ఐతే ఈ వాహన డ్రైవర్ ఎప్పుడు వచ్చినా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ. బాలింతలను ఇంటివద్ద దించాల్సి వున్నా రోడ్డు పైనే దించి వెళ్ళి పోవటం అలవాటు గా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.