హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత (వీడియో)

తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ పోలీసులు ఓ హవాలా రాకెట్ ముఠాను పట్టుకున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి భారీగా నగదును తీసుకొస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల నుంచి రూ.7.7 కోట్ల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్  రోడ్డు నంబర్ 12లో ఓ ఇంటిలో నగదు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న అధికారులు బుధవారం ఉదయం దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే వీరిని కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ నగదును ఎవరికోసం తీసుకొచ్చారు? ఎవరు పంపారు? అసలు ఈ నగదు బట్వాడా వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. డబ్బులు తరలిస్తున్న వారిని రాజ్ పురోహిత్, సునీల్ కుమార్, ఆశిష్ కుమార్, మహ్మద్ ఆజాంగా గుర్తించారు. వారి పై 171(B), 468, 471, 420, 120(B) సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

వీరిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరతామని తెలిపారు. కాగా, ఓ రాజకీయ నేత ఇంటి సమీపంలోనే ఈ మొత్తం నగదు దొరకడంతో ఆ కోణంలోనూ దర్యాప్తును కొనసాగిస్తున్నామని వెల్లడించారు.  డబ్బులు పట్టుకున్న వీడియో కింద ఉంది చూడండి.