టిటిడి కిరీటాల దొంగ దొరికాడు, బంగారు తరలింపు వివాదం మధ్య ప్రకటన

ఆ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) నిర్వహణ  బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నుంచి లాక్కుని  ఏ దైనా ధార్మిక సంస్థకు అప్పగించాలని బిజెపి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి క్యాంపెయిన్ మొదలుపెట్టారు.

ఆయన కోర్టులో ఈ మేరకు పిటిషన్ కూడా వేశారు.

ఒక పదేళ్లుగా టిటిడి పాలన చాలా అవకతవకలుగా ఉంది. కుంభకోణాలు,అవినీతి, దొంగతనాలు, అభరాణాల నుంచి వజ్రాలు మాయం కావడం, రాజకీయజోక్యం … ఇలా టిటిడి పాలన అంత పవిత్రంగా సాగడం లేదని అర్థమవుతుంది.

ఈ విషయం మరొకసారి ఈ రోజు వెల్లడయింది.

దాదాపు మూనెళ్ల కిందట తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో మాయమయిన బంగారు కిరీటాల చోరీ కేసును చేధించామని పోలీసులు ప్రకటించారు.

ఒక వైపు చెన్నైనుంచి ఎలాంటి ఆథరైజేషన్ లేెకుండా బంగారు తరలింపు వివాదం చెలరేగుతున్నపుడు పోలీసుల తమ ఘన విజయం ప్రకటించారు.

ఈ కిరీటాలు ఫిబ్రవరిలో మాయమయ్యాయి. 1300 గ్రాముల బరువుతో, విలువైనరాళ్లు పొదిగిన ఈకిరిటాలు తిరుపతి పట్టణం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయం నుంచి మాయమయ్యాన్న వార్తే నమ్మశక్యం కానిది. గుడిలో ఎపుడూ జనం ఉంటారు. పోలీసుల కాపలా. సిసి కెమెరాల నిఘా. ఎవరైనా కొత్త వ్యక్తి ఈ నిఘాను కాదని లోపలికి చొరబడటం అనేది ఎలా సాధ్యం. ఫిబ్రవరి 2 వ తేదీన పురోహితులు సుప్రభాత సేవలలో ఉన్నపుడు ఈ చోరీ జరిగిందని భావిస్తున్నారు. తర్వాత విధులలో ఉన్న ఒక మహిళా కాన్ స్టేబుల్ కిరిటాలు మాయమయి ఉండటం చూశారు. ఆమె పురోహితులకు ఈవిషయం చెప్పారు. తర్వాత ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది.

ఇపుడు 80రోజుల పాటు విచారణ తర్వాత దొంగని పట్టుకున్నామని తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ ప్రకటించారు.

టిటిడి 1381 కెజిల బంగారాన్ని ఎలాంటి కాగితం లేకుండా చెన్నై నుంచి తిరుపతి తరలిస్తూ పోలీసుల కంటపడటం వివాదంగా మారిన సమయంలో పోలీసులు దొంగదొరికాడని ప్రకటించారు. ఇది యాదృచ్ఛికమా లేక ఆ వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకా?

మంగళవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ అన్బురాజన్‌ విచారణ గురించి వివరించారు.
దొంగను పట్టుకునేందుకు ఆలయంలోని మొత్తం 237 సీసీ కెమెరాలను పరిశీలించామని, అందులో ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ కనిపించాడని ఆయన చెప్పారు.

నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఖాందార్‌కు చెందిన వాడని అతని పేరు ఆకాశ్‌ అని ఆయన చెప్పారు. కిరిటాలు మయామయిన రోజు ఉదయం ఆకాశ్‌ తన స్నేహితుడొకరిని రేణిగుంట రైల్వేస్టేషన్‌ లో కలుసుకుని చెన్నైకి పంపాడని ఆయన వెల్లడించారు. ‘కిరీటం చోరీ చేసిన తర్వాత రైలులో అతడు కాచిగూడ వెళ్లి, అక్కడి నుంచి నాందేడ్‌లోని ఖాందార్‌కు చేరుకున్నాడు. అక్కడే బంగారు వర్తకుల వద్ద కిరీటాలను కరిగించి రూపం మార్చేశాడు. నిందితుడు అంతకు ముందు కొన్ని మొబైల్ ఫోన్లను దొంగిలించాడని ఆలయంలో దొంగతనం చేసుముందుకు వాటిని మరొక చోట దాచి ఉంచాడు. ఇపుడు ఆ ఫోన్లను తీసుకొనేందుకు వస్తున్నట్లు తెలుసుకుని పట్టుకున్నాం,’ అర్బన్ ఎస్ పి చెప్పారు.

అతని నుంచి 1300 గ్రాముల బంగారు కడ్డీలను సీజ్‌ చేశామని ఆయన తెలిపారు.

ఫిబ్రవరి 2న చోరీ జరిగిన నాటి నుంచి నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందంలోని పోలీసులు తీవ్రంగా శ్రమించారని అంటూ వారికి అభినందనలు చెప్పారు.