సీఎం జగన్ ని ప్రతిపక్షం ఇబ్బంది పెట్టిన ప్రతిసారి కొడాలి నానినే అడ్డంగా నిలబడిపోయి కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ప్రభుత్వంలో బాగా కీలకంగా ఉండే మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కూడా కొడాలి నానినే . తమ ప్రభుత్వానికి, పార్టీకి అండగా ఉంటూ, ప్రతిపక్షాలపై కొడాలి దూకుడుగా వెళతారు. అందుకే మొదట నుంచి టీడీపీ, కొడాలి నాని టార్గెట్గా రాజకీయాలు చేస్తూనే ఉంది. పైగా గుడివాడ నియోజకవర్గంలో కొడాలికి తిరుగులేదు. అందుకే ఆయన్ని ఎలాగైనా గుడివాడ ప్రజల్లో నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు పనిచేస్తున్నారు.
కొడాలి పరుష పదజాలంతో టీడీపీపై విరుచుకుపడతారు. అందుకే ఆయన్ని భాష ఏమి బాగోదని, బూతులు మంత్రి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా కొడాలి తమపై విరుచుకుపడుతుండటంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో అర్ధంకాక ఆయన్ని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్నారు.ఆయన శాఖపై అవినీతి ఆరోపణలు చేశారు. అలాగే బూతులు మాట్లాడతారని ప్రచారం చేస్తున్నారు. తాజాగా అయితే కొడాలిని పేకాట వ్యవహారంలో ఇరికించే కార్యక్రమం పెట్టుకున్నారు. గుడివాడలో పోలీసుల రైడ్లో పలువురు పేకాట రాయుళ్ళు దొరికారు. వారంతా కొడాలి నాని అనుచరులని, కొడాలి ఆధ్వర్యంలోనే గుడివాడలో పేకాట విచ్చల విడిగా ఆడుతున్నారని విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
అటు టీడీపీ అనుకూల మీడియా సైతం కొడాలిని ఇబ్బంది పెట్టే కార్యక్రమమే చేస్తుంది. ఇక ఇదంతా జగన్ని దెబ్బకొట్టడంతో పాటు గుడివాడలో కొడాలికి చెక్ పెట్టాలనే ఉద్దేశం మరొకటి. అయితే టీడీపీ ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత నెగిటివ్ చేయాలని చూసినా గుడివాడపై కొడాలికి పట్టు జారదు. ఎందుకంటే ఇక్కడ కొడాలికి ధీటుగా నిలబడే నాయకుడు లేరు. టీడీపీలో ఉన్న రావి వెంకటేశ్వరరావు పెద్దగా పోటీ ఇవ్వలేరు. అటు బీజేపీ, జనసేనలకు అంత సీన్ లేదు. కాబట్టి గుడివాడలో కొడాలికి చెక్ పెట్టడం అంత సులువు కాదు. ఆయనపై ఎన్ని ఆరోపణలు చేస్తే అంత బాగా కలిసి వస్తుంది.