లోకేష్ హైకోర్టులో షాక్… నోటీసులతో ఢిల్లీ బయలుదేరిన సీఐడీ!

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్మెంట్‌ స్కాం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ను ఏ-14 గా చేర్చుతూ ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ రోజు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. వాదనల అనంతరం లోకేష్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు డిస్పోస్‌ చేసింది.

ఇదే సమయంలో ఈ కేసులో లోకేష్‌ కు 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు విచారణకు సహకరించాల్సిందేనని లోకేష్‌ కు సూచించిందని తెలుస్తుంది. ఈ కేసులో లోకేష్‌ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలు వినిపించారు.

హైకోర్టు ఇచ్చిన సూచనల నేపథ్యంలో… ఇప్పడు సీఐడీ టీం కాసేపట్లో లోకేష్ కు 41-ఏ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దంచేస్తుందని అంటున్నారు. ఎప్పుడు విచారణకు రావాలనేది ఆ నోటీసులో స్పష్టం చేయనున్నారని తెలుస్తుంది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ ఢిల్లీ బయల్దేరిందని తెలుస్తుంది. మరికాసేపట్లో ఏపీ సీఐడీ అధికారులు లోకేష్‌ ను కలిసి నోటీసులు అందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో… హైకోర్టులో లోకేష్‌ లాయర్లు మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాం, ఫైబర్‌ గ్రిడ్‌ కేసుల్లో కూడా లోకేష్ నిందితుడిగా ఉండటంతో… ఈ రెండు కేసుల్లోనూ అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ రెండు పిటిషన్లు బెంచ్‌ ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

కాగా, అరెస్టులకు భయపడే మీరు ఢిల్లీలో ఉండిపోయారు అని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన నారా లోకేష్… ఢిల్లీకి వచ్చి అరెస్ట్‌ చేసే దమ్ము ఏపీ సీఐడీకి లేదా.. అంటే కేసులో పసలేదనేకదా అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా… ఢిల్లీ కాదు.. సప్త సముద్రాల అవతల చెట్టు తొర్రలో దాక్కున్నా తప్పు చేస్తే అరెస్ట్‌ కావాల్సిందే అంటూ పేర్ని నాని స్పందించిన సంగతి తెలిసిందే.