Sana Satish Babu: తెలుగుదేశం పార్టీ (TDP) వ్యవస్థాగత ప్రక్షాళనలో భాగంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబును పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతం, యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ ప్రకటించిన నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలలో సతీశ్ బాబుకు సముచిత స్థానం లభించింది.
మొత్తం 18 మందితో కూడిన జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ బాబుకు చోటు కల్పించారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, రాజ్యసభలో పార్టీ గళాన్ని బలంగా వినిపిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకుని ఈ పదవిని అప్పగించారు. ఇదే కమిటీలో నారా లోకేశ్ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా, పల్లా శ్రీనివాస్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు.

తన నియామకంపై సానా సతీశ్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. “సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, నేడు జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎదిగే అవకాశం కేవలం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ఈ పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుంది. నాపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను.” అని అన్నారు.

కాకినాడ జిల్లాకు చెందిన సానా సతీశ్ బాబు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన, ఇప్పుడు జాతీయ స్థాయిలో బాధ్యతలు చేపట్టడం ద్వారా పార్టీలో తన ప్రాధాన్యతను మరింత పెంచుకున్నారు. ఈ నియామకంపై పార్టీ శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

