Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు వారిని మందలించడమే కాకుండా, తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించాల్సిన గ్రీవెన్స్ సమావేశాలు, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే క్యాడర్ సమావేశాలు నిర్వహించని నేతల జాబితాను లోకేష్ ఈ సందర్భంగా బయటపెట్టారు.
వరుసగా నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాలు చేపట్టని ప్రజాప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “పార్టీ ఆదేశాలను పాటించకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు” అని గట్టిగా హెచ్చరించారు.
రాడార్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు వీరే.. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ముగ్గురు కీలక ఎమ్మెల్యేలపై లోకేష్ గురిపెట్టారు.

పుట్టా సుధాకర్ యాదవ్ (మైదుకూరు ఎమ్మెల్యే)
రెడ్డెప్పగారి మాధవి రెడ్డి (కడప ఎమ్మెల్యే)
వరదరాజులు రెడ్డి (ప్రొద్దుటూరు ఎమ్మెల్యే)
వీరితో పాటు పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కూడా క్యాడర్ సమావేశాలు నిర్వహించనందుకు లోకేష్ ఆగ్రహానికి గురయ్యారు. అలాగే ధర్మవరం ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ వరుసగా గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించకపోవడంపై వివరణ కోరారు.
ఈ కార్యక్రమాలు ఎందుకు నిర్వహించలేదో తెలుసుకుని, సదరు నేతల నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని లోకేష్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, ప్రజలకు చేరువ కావడం విషయంలో ఎవరూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
“ప్రజల కష్టాలను వినడానికి, కార్యకర్తలకు అండగా ఉండటానికి సమయం కేటాయించలేని నేతలను పార్టీ గమనిస్తూనే ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి అలసత్వాన్ని సహించేది లేదు.” – మంత్రి నారా లోకేష్
మంత్రి లోకేష్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల మంత్రుల్లో సైతం చర్చ మొదలైంది. పనితీరు ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలను ఆయన ఈ సమావేశం ద్వారా పంపినట్లయింది.

