శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చేసిన పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆకస్మిక తనిఖీకి మారువేషంలో వచ్చి, ఒక సామాన్యమైన రోగిలా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల సమస్యలను, వైద్యుల, సిబ్బంది పనితీరును స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్తో పాటు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.
నిన్నా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తలకు క్యాప్, మాస్క్ ధరించి, చేతిలో ఒక పాత మొబైల్ ఫోన్ తీసుకుని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన నేరుగా ఆసుపత్రి గేటు వద్ద నుండి లోపలికి వెళ్లి వార్డులు, ఓపీడీ రూములు, మందుల డిస్పెన్సరీల వద్ద ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించారు. మారువేషంలో ఉండటం వల్ల ఎవరూ ఆయన్ను గుర్తించకపోవడంతో అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ఆయన స్పష్టంగా తెలుసుకోగలిగారు.
ఆసుపత్రి పనితీరును గమనించిన అనంతరం ఎమ్మెల్యే మారువేషంలోనే ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. డాక్టర్లు సమయానికి వస్తున్నారా? సరిగ్గా చికిత్స ఇస్తున్నారా? డాక్టర్ల కోసం ఎంతసేపు ఎదురు చూడాల్సి వస్తుంది? వంటి అనేక ప్రశ్నలు వేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొందరు రోగులు డాక్టర్ల పనితీరు పైన అసహనం వ్యక్తం చేస్తే, మరికొందరు ఔషధాల డిస్పెన్సరీల్లో మందులు స్టాక్లో లేవని ఆయనకు చెప్పారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం అమెరికాలో ఘనంగా జరిగింది
ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి నేడు రూ.15,000 జమ: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం
ఒక వృద్ధుడు అయితే స్కానింగ్ కోసం రోజంతా వేచి ఉండాల్సి వస్తుందని వాపోయారు. అలాగే, ఆసుపత్రిలో పడకలు కూడా తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రోగులు ఆయనకు వివరించారు. ఈ సమస్యలన్నింటిని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు స్వయంగా నోట్ చేసుకున్నారు.
రోగుల సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత ఎమ్మెల్యే రాజు తన మాస్క్ను తొలగించి వారికి కనిపించారు. దీంతో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును గుర్తించిన రోగులు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే ఇలా మారువేషంలో వచ్చి సమస్యలు తెలుసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు డ్యూటీ డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందితో మాట్లాడారు. సమయపాలన పాటించాలని, రోగులకు సకాలంలో చికిత్సలు అందించాలని వారి బాధ్యతలను గుర్తు చేశారు. ముఖ్యంగా మందుల స్టాక్ లేకపోవడం పైన, సిబ్బంది పనితీరు పైన లోపాలను ప్రశ్నిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్కు వివరణ కోరారు.
మడకశిర ఎమ్మెల్యే మారువేషంతో ఆసుపత్రిలో అలసత్వం ప్రదర్శిస్తున్న వారందరికీ తన చర్య ద్వారా ఒక గట్టి హెచ్చరికను జారీ చేసి ఆసుపత్రి నుంచి నిష్క్రమించారు.

