ఏ గళమైనా ఎన్టీఆర్… లోకేష్ కు బోనస్ ఎఫెక్ట్!

రాబోయే ఎన్నికల్లో ఓటర్లు టీడీపీకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో తెలియదు కానీ… లోకేష్ పాదయాత్ర చేసే దాదాపు ప్రతీ చోటా ఆయనకు ఎన్ టీఆర్ ఫ్యాన్స్ మాత్రం షాకిస్తూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలోని ఫోటోల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

“అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే” అంటూ ఒంగోలులో ఇప్పటికే ఒక భారీ ఫ్లెక్స్ పెట్టి చినబాబుకి షాకిచ్చిన నందమూరి అభిమానులు తాజాగా కృష్ణాజిల్లాలోనూ అలాంటిపనికే పూనుకున్నారు. ఇందులో భాగంగా సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలతోపాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు మాత్రమే పెట్టి ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు!

అవును… తాజాగా గన్నవరం నియోజకవర్గంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో “ఫ్యూచర్‌ సీఎం.. జూ.ఎన్టీఆర్‌” అంటూ పసుపు రంగులో ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా… “యువగళమైన.. జనగళమైన.. నవగళమైన.. ఏ గళమైనా తెలుగు నాట స్మరించే పేరు ఒక్కటే.. నందమూరి తారకరామారావు” అని జూనియర్ ఫోటోపై ఫ్యూచర్ సీఎం అని ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు!

మరోపక్క నారా లోకేశ్ పాద‌యాత్ర ల‌క్ష్యం మ‌రిచిన‌ట్టు క‌నిపిస్తోందనే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. ఎక్కువ గంట‌లు, ఎక్కువ కిలోమీట‌ర్లు న‌డ‌వ‌డ‌మే ప్ర‌ధాన ఎజెండాగా సాగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… ఎల్లో మీడియా సైతం ఎక్కువ దూరం న‌డ‌వ‌డ‌మే గొప్ప అంటూ లోకేశ్‌ ను పొగుడుతూ నాశ‌నం చేస్తోందని అంటున్నారు.

పాదయాత్ర అసలు లక్ష్యం పక్కకు పోయి చాలా కాలమే అయ్యిందని… కేవలం ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు, ఎర్ర బుక్కులో పేర్లు రాసుకోవడాలతోనే సరిపోతుందని అంటున్నారు! వాటికి తోడు మధ్య మధ్యలో… ఇలా షాక్ ఇస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు దర్శనమిస్తున్నాయని.. ఇది బోనస్ ఎఫెక్ట్ అని అంటున్నారు!