దేశం మొత్తాన్ని కన్నీరు పెట్టించిన వీర జవాన్ భార్య (వీడియో)

వారి పెళ్లి అయ్యి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. కొత్త జీవితం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోకుండా అంతులేని విషాదం వారి జీవితాన్ని కుదుపేసింది. మొదటి పెళ్లి రోజుకు సెలవు పెట్టి వస్తానని చెప్పిన భర్త ఇక శాశ్వత సెలవు తీసుకున్నాడు. దీంతో ఆ నవ వధువు తన భర్తకు కడసారి కన్నీటితో వీడ్కోలు పలికింది. ఆమె తన కన్నీటితో దేశం మొత్తాన్ని కన్నీరు పెట్టేలా చేసింది.

ఉత్తరఖాండ్ రాష్ట్రం డెహ్రాడూన్ ప్రాంతానికి చెందిన విభూతి శంకర్ డౌండియాల్ ఆర్మీలో మేజర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి గత సంవత్సరం నికితా కౌల్ తో వివాహం జరిగింది. ప్రస్తుతం పుల్వామాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో వీరి ప్రథమ వివాహ వార్షికోత్సవం ఉంది. దీంతో తాను పెళ్లి రోజు నాటికి సెలవు పెట్టి వస్తానని భార్యకు చెప్పాడు. తన భర్త రాక కోసం ఆనందంగా ఆమె ఎదురుచూస్తుంది. 

ఇంతలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో శంకర్ మరణించాడు. దీంతో మంగళవారం శంకర్ భౌతికకాయాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు నికితా తన భర్తను చూస్తూ అలాగే ఉండిపోయింది. శవపేటిక పై ఉన్న శంకర్ ఫోటోను చూస్తూ నిర్ఘాంతపోయి ఉంది. కాసేపటికి తనను తాను నిబ్బరపరుచుకొని సెల్యూట్ చేసింది. జైహింద్ అంటూ నినదించింది. తన అరచేతిని ముద్దుపెట్టుకుంటూ శవపేటిక పై వంగి ఐ లవ్ యూ అంటూ ఉద్వేగంగా చెప్పింది.

దీనిని చూసిన అక్కడి ప్రజలు, బంధువులు, ఆర్మీ అధికారులు కన్నీరు కార్చకుండా ఉండలేకపోయారు. మా ఆయన గొప్ప సాహసి.. అందుకు నేనేమి నిస్సహాయురాలిని కాదు అంటూ నిబ్బరంగా అంది. శంకర్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో హరిద్వార్ లోని గంగానదీ తీరాన ముగిశాయి.

నికితా కౌల్ వీడియో కింద ఉంది చూడండి.

 

https://www.youtube.com/watch?v=3GN40TRKZPY