జగన్ పాదయాత్ర ముగింపులో మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం (వీడియో)

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. జనవరి తొమ్మిదితో పాదయాత్ర ముగియనుంది. ఆరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు వైసీపీ నేతలు. పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఘనమైన పండుగలా జరుపుకోవడానికి వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా మరో ఘట్టం ఆవిష్కరించనున్నారు వైసీపీ నేతలు. ఆ వివరాలు కింద ఉన్నాయి చూడండి.

ప్రజాసంకల్పయాత్రకు ప్రతీకగా భారీ స్థూపాన్ని ఇచ్చాపురంలో నిర్మిస్తున్నారు. పాదయాత్ర ముగింపు దశకు చేరుకోవడంతో దీనికి సంబంధిన పనులు వేగవంతం చేశారు. జగన్‌ పాదయాత్ర విశేషాలను వివరించేలా డిజైన్‌ రూపుదిద్దుకుంటోంది. గ్రానైట్‌ పలకలపై పాదయాత్ర విశేషాలు పొందుపరుస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా ముగింపు చెప్పబోతోంది. పాదయాత్ర సంకల్పాన్ని చాటిచెప్పేలా చిరస్థాయిగా నిలిచిపోయేలా స్థూపాన్ని యుద్ధప్రాతిపదికన పార్టీ పూర్తిచేస్తోంది. పాదయాత్ర స్ఫూర్తిని, ప్రజలకిచ్చిన భరోసాలను గుర్తుకు తెస్తూ ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు.

శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న మార్గంలో జాతీయ రహదారికి ఆనుకుని ఎడమవైపున, అటువైపు బరంపురం నుంచి వస్తున్నప్పుడు కుడివైపున, బహుదానది తీరాన ఈస్థూపం రూపుదిద్దుకుంటోంది. ఇచ్ఛాపురం టౌన్‌కు 2 కిలోమీటర్ల ముందే ఈ స్థూపం కనిపిస్తుంది. పాదయాత్ర చివరిరోజున జగన్‌ ఈ స్థూపాన్ని ఆవిష్కరిస్తారు. గతంలో వైయస్సార్‌ చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర కూడా ఇచ్ఛాపురంలోనే ముగిసింది. దీనికి గుర్తుగా ప్రజాప్రస్థాన ప్రాంగణాన్ని నిర్మించారు. ఆతర్వాత వైయస్‌ షర్మిళ “మరో ప్రజాప్రస్థానం’’ కూడా ఇచ్ఛాపురంలోనే ముగిసింది. దీనికి గుర్తుగా మరో స్థూపాన్ని నిర్మించారు.

మూడు అంతస్తుల లెక్కన, పునాది నుంచి 88 అడుగుల ఎత్తులో స్థూపం ఉంటుంది. పునాది నుంచి స్థూపం బేస్‌ వరకూ 13 జిల్లాలను సూచిస్తూ 13 మెట్లు నిర్మించారు. నాలుగు పిల్లర్లపై 3 అంతస్తుల్లో స్థూపం ఉంటుంది. మొదటి అంతస్తులో వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఫొటోలు ఉంటాయి. రెండో అంతస్తులో దివంగత నేత వైయస్సార్‌ ఫొటోలు ఉంటాయి. చివరి అంతస్తు వృత్తాకార ఆకృతిలో ఉంటుంది.

చివరి అంతస్తు డోమ్‌ నుంచి 15 అడుగుల ఎత్తులో పార్టీ పతాకాన్ని పెడుతున్నారు. స్థూపానికి చుట్టూ ఉన్న ప్రహరీగోడపైన పాదయాత్ర విశేషాలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నామని వైయస్సార్‌సీపీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం పేర్కొనారు. స్థూప నిర్మాణంలో గెలాక్సీ గ్రానైట్‌ను వినియోగిస్తున్నారు. ఈ గ్రానైట్‌ పలకలపై పాదయాత్ర ఫొటోలను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ముద్రించారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.