Dharmana Prasada Rao: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణే అసలైన ప్రజాస్వామ్యమని, కేవలం ఒకే ప్రాంతానికి ప్రాధాన్యతనిస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోరా?
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్పైనే నిధులు కుమ్మరించడం వల్ల విభజన తర్వాత ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ధర్మాన గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారని ఆయన హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన సూచనలను పెడచెవిన పెట్టడం రాష్ట్ర భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ నివేదికలను కాదని, రాజ్యాంగ విరుద్ధంగా అమరావతిని శాశ్వత రాజధానిగా మార్చడం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ చేయించారని ఆయన ఆరోపించారు.

“ఉత్తరాంధ్రలో 80 ఏళ్ల వయసులో కూడా ప్రజలు బతుకుదెరువు కోసం వలస వెళ్తున్నారు. ఇక్కడి ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు” అని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు ₹3.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో శ్రీకాకుళం ప్రాజెక్టుల కోసం కనీసం ₹1,000 కోట్లు కూడా కేటాయించలేరా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అమరావతిలో మౌలిక వసతుల కల్పనకే ₹2 లక్షల కోట్లు అవసరమని, అది పూర్తి కావడానికి 50 ఏళ్లు పడుతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతున్నారని ధర్మాన విమర్శించారు. అంతకాలం పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండాలా అని ఆయన నిలదీశారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని, ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. నిపుణుల నివేదికలను ప్రభుత్వం గౌరవించాలి. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నిధుల కొరతపై ధర్మాన ఆందోళన.

