సంచలనం : జగన్ ఓటుకే ఎసరు ..ఫారం 7 దాఖలు

జగన్మోహన్ రెడ్డి ఓటును కూడా ఏరివేయటానికి ప్రత్యర్ధులు పన్నాగం పన్నారు. తన ఓటు తీసేయాలంటు ఏకంగా జగన్ పేరుతోనే ఎన్నికల కమీషన్ కు ఫారం 7 దరఖాస్తు అందటం ఇపుడు సంచలనంగా మారింది. ప్రత్యర్ధుల పన్నాగం చూస్తుంటే జగన్ ను అసలు పోటీకే అనర్హుడిని చేయాలని ప్లాన్ వేసినట్లు అర్ధమవుతోంది. అయితే సకాలంలో వైసిపి నేతలు మేల్కొనటంతో ప్రత్యర్ధుల ఎత్తులు చిత్తతయ్యాయి. ప్లాన్ బయటపడటంతో వైసిపి ఫిర్యాదులు  చేయటం, పోలీసులు దర్యాప్తు చేయటం ఎలాగు మొదలైందనుకోండి అది వేరే సంగతి.

దొంగఓట్లు ఏరేయటానికి ఉద్దేశించింది ఫారం 7 పేరుతో ఇప్పటికే సుమారు 8 లక్షల దరఖాస్తులు ఎన్నికల సంఘం దగ్గరకు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశంపార్టీ నేతలే తమ ఓట్లను తీయించేస్తున్నట్లు జగన్ అండ్ కో గగ్గోలు పెడుతున్నారు. టిడిపి రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తోందట. మొదటిది లక్షల్లో దొంగఓట్లను చేర్చించటం, రెండోది వైసిపి సానుభూతిపరుల ఓట్లను తీయించేటం. ఈ రెండింటితో టిడిపి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందంటూ జగన్ దగ్గర నుండి క్రిందిస్ధాయి నేతల వరకూ ఒకటే గోల  చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

సరే, తమ బండారం బయటపడిన తర్వాత చంద్రబాబునాయుడు అండ్ కో జగన్ అండ్ కో పై ఎదురుదాడికి దిగారు. వైసిపి వాళ్ళే దొంగఓట్లు చేర్పిస్తు, తమ ఓట్లను తీయించేస్తు తమపైనే తిరిగి ఆరోపణలు చేయిస్తున్నట్లు మండిపోతున్నారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమ ఓటును వైసిపి వాళ్ళు తీయించేసినట్లు టిడిపి నేత ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. పైగా వైసిపి ఫిర్యాదులు చేసేంత వరకూ టిడిపి వాళ్ళు దొంగఓట్ల గురించి కానీ ఓట్లు తీయించే విషయంలో కానీ ఎక్కడా మాట్లాడ లేదు. అంటే దాన్ని బట్టే అర్ధమవుతోంది ఎవరి ఓటును ఎవరు తీయించేస్తున్నారో.

అన్నింటికీ పారకాష్టగా ఏకంగా జగన్ ఓటునే తీయించేసేందుకు కుట్ర పన్నటం. దీన్ని బట్టే రాబోయే ఎన్నికల్లో గెలుపుకు టిడిపి ఏ స్ధాయికి దిగజారిపోయిందో అర్ధమైపోతోంది. జరిగిన ఘటనతో నిజంగా జగన్ కే షాక్ కొట్టినట్లైంది. మరి అధికారులు ఏం  చేస్తారో చూడాల్సిందే.