కన్నా సుజనా ల మధ్య ఏం జరుగుతుంది?

కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్ర ప్రదేశ్ బిజెపి పార్టీ అధ్యక్షులు. సుజనా చౌదరి నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడు. బిజెపి తన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా నలుగురు తెలుగుదేశం ఎంపీలకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. అందులో సుజనా చౌదరి ముఖ్యుడు.

మోడీ క్యాబినెట్ లో గతంలో సహాయ మంత్రిగా చేసినందువలన బిజెపి హైకమాండ్ దగ్గర సుజనా చౌదరికి మంచి పట్టుంది. సరిగ్గా ఇదే విషయమై కన్నా లక్ష్మీనారాయణ సుజనాచౌదరికి తీవ్ర విభేదాలు తలెత్తుతున్నాయట. కన్నా లక్ష్మీనారాయణ వర్గం సుజనా చౌదరికి హైకమాండ్ లో ఉన్న పలుకుబడితో ఎక్కడ తమ నాయకుడిని డామినేట్ చేస్తారో అని బెంగ పట్టుకుందట.

సుజనా అవసరం బీజేపీ కి వుంది

బిజెపి హైకమాండ్ కూడా సుజనా చౌదరికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే బిజెపి దీర్ఘకాలిక ప్రణాళికలో బిజెపికి కన్నా లక్ష్మీనారాయణ కంటే సుజనా చౌదరి ముఖ్యం. బిజెపి వారు  తెలుగు దేశం నుండి వలసలు ప్రోత్సహిస్తున్నారు. అయితే ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలంటే దానికి సుజనా చౌదరి సమర్ధుడు అని బీజేపీ భావిస్తుంది. సుజనా చౌదరి తెలుగుదేశం లో ఒక ముఖ్యమైన సభ్యుడిగా చాలా సంవత్సరాలు కొనసాగారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు సుజనా చౌదరి వల్లే గతంలో పార్టీలో టికెట్లు లభించాయి. అందుచేత రాబోవు కాలంలో తెలుగు దేశం నుండి ముఖ్యమైన నాయకులను బిజెపిలోకి ఆకర్షించాలంటే సుజనా చౌదరి అవసరం బీజేపీకి ఉంది.

ఇది ముందుగానే ఊహించిన కన్నా లక్ష్మీనారాయణ సుజనా చౌదరికి రాష్ట్రంలో ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వదలుచుకోలేదు. దానికి ఉదాహరణ బిజెపిలో చేరి విజయవాడ విమానాశ్రయానికి వచ్చిన సుజనా చౌదరిని కన్నా లక్ష్మీనారాయణ కనీసం మర్యాదపూర్వకంగా అయినా కలుసుకోలేదు.

దానికి కన్నా లక్ష్మీనారాయణ వర్గం ఇస్తున్నా వివరణ ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ ఈ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక్కడ ఏది జరగాలన్నా కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాలే ముఖ్యం. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడు కావచ్చు కానీ రాష్ట్ర అధ్యక్షుడే ఇక్కడ సుప్రీమ్. అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాల్లో నెగ్గుకొచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు ఇదేం కొత్తకాదు. ముందు ముందు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో  వేచి చూడాలి.