Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. రాజధానికి సంపూర్ణ చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉద్దండరాయుని పాలెంలో పర్యటించారు. రాజధాని శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలిలో రైతులతో కలిసి ఆయన సంబరాల్లో పాల్గొన్నారు.
నాడు ప్రధానమంత్రి మోదీ రాజధాని శంకుస్థాపన సమయాన తీసుకువచ్చిన యమునా నది జలాలు, పవిత్ర మట్టిని ఉంచిన వేదిక వద్ద చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. ఆంధ్రుల ఆశల ప్రతిరూపమైన ఆ పవిత్ర వేదికకు ఆయన సాష్టాంగ ప్రణామం చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య దీప హారతి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ అమరావతి సాధన కోసం రైతులు చేసిన పోరాటాన్ని కొనియాడారు.

“అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నం. 29 వేల మంది రైతులు నమ్మకంతో ఇచ్చిన 33 వేల ఎకరాల భూమి వల్లే ఇవాళ రాజధాని ఈ స్థాయికి చేరింది. ఐదేళ్ల చీకటి రోజులను, అనేక కుట్రలను ఎదుర్కొని ప్రజా సంకల్పంతో ఈ విజయాన్ని సాధించుకున్నాం.” – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
గత వైకాపా (YSRCP) ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజావేదిక విధ్వంసంతో మొదలుపెట్టి అమరావతిని స్మశానంగా మార్చాలని చూసిన వారు, రాజధానితో మూడు ముక్కలాట ఆడి చివరకు అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. అమరావతి బిల్లుపై పార్లమెంటు నుంచి వాకౌట్ చేసిన వైసీపీని ప్రజలు శాశ్వతంగా ‘బ్లాక్ అవుట్’ చేయాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆంధ్రుల ఆకాంక్షను గౌరవించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
రాజధాని కోసం 1631 రోజుల పాటు సాగిన ఉద్యమాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తన సతీమణి భువనేశ్వరి తన చేతి గాజులను ఉద్యమానికి విరాళంగా ఇచ్చారని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముళ్ల కంచెలు దాటుకుని వచ్చి రైతులకు అండగా నిలిచారని స్మరించుకున్నారు.

పార్లమెంటులో చట్టబద్ధత లభించినందున ఇకపై అమరావతిని ఎవరూ మార్చలేరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి అభివృద్ధి నమూనాలను అమరావతికి తీసుకువస్తానని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తూ.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత అడ్రస్గా నిలుపుతానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, బీజేపీ నేత మాధవ్ మరియు వేలాది మంది రాజధాని రైతులు పాల్గొన్నారు.

