AP Industrial Growth: లక్ష ఉద్యోగాల లక్ష్యంతో ‘ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్’ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

AP Industrial Growth: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అనకాపల్లి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ (AM/NS) భారీ ఉక్కు పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

20 నెలల్లోనే సాకారం – ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’. గత ప్రభుత్వాల జాప్యానికి భిన్నంగా, కేవలం 20 నెలల కాలంలోనే భూసేకరణ, అనుమతులు పూర్తి చేసి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన ప్రకటించారు.

భారీ ఉత్పత్తి సామర్థ్యం రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ప్లాంట్ ద్వారా ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి కానుంది. స్టీల్ ప్లాంట్‌తో పాటు రూ. 11,198 కోట్లతో ప్రత్యేక క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మిస్తున్నారు. 2028 నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలని, 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్ట్ ఫర్నెస్, డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్లాంట్ కోసం ప్రత్యేకంగా 4 లేన్ల రహదారి, ముడి ఇనుము సరఫరా కోసం పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే విధంగా విశాఖపట్నాన్ని ఒక గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) రావడం దేశ చరిత్రలోనే తొలిసారి అని ఆయన గుర్తు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ ద్వారా ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ నినాదాన్ని విజయవంతం చేస్తామని ప్రకటించారు.

పరిశ్రమ కోసం భూములు త్యాగం చేసిన రైతులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్టీల్ ప్లాంట్‌లో మొదటి ప్రాధాన్యతగా అనకాపల్లి జిల్లా యువతకే ఉద్యోగాలు కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు. ఉక్కు ఉత్పత్తితో పాటు విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు (Center of Excellence) ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం ఒక ‘స్టీల్ సిటీ’గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

చివరగా, జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలపేట పోర్టులను కూడా ప్రారంభిస్తామని, ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలబెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

కూటమి పై అమరావతి రైతుల్లో ఆగ్రహం.. | YS Jagan Master Plan | Amravati Farmers | CM Chandrababu