అఖిలకు షాక్ ఇచ్చిన బిజెపి

మాజీ మంత్రి అఖిలప్రియకు బిజెపి పెద్ద షాకే ఇచ్చింది. తమ సోదరులు ఇద్దరు బిజెపిలో చేరటంతో మాజీ మంత్రికి షాక్ తగిలినట్లైంది. ముందుగా అఖిలనే బిజెపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ  తమ పార్టీలో చేరటానికి గొంతెమ్మ కోరిక కోరిన అఖిలను వదిలేసి ఆమె సోదరులకు కమలం కండువా కప్పారని సమాచారం.

ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు నాయకత్వంపై నమ్మకం లేకపోవటంతో చాలామంది నేతలు బిజెపిలో చేరుతున్నారు. ఇందులో భాగంగానే అఖిలను కూడా చేరాల్సిందిగా బిజెపి నేతలు ఆహ్వానించారట. కానీ అందుకు అఖిల ఓ షరతు విధించినట్లు సమాచారం. తాను బిజెపిలో చేరాలంటే రాజ్యసభ ఎంపి పదవిని అడిగారట.

అఖిల షరతు విన్న తర్వాత ఆమెకు అంతసీన్ లేదని నిర్ధారించుకున్నారు. దాంతో ఆమె సోదరులు భూమా మహేష్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి పై ఫోకస్ చేశారు. వాళ్ళ మధ్య చర్చలు సఫలం కావటంతో వెంటనే  సోదరులిద్దరూ ఢిల్లీకి వెళ్ళి జేపి నడ్డా సమక్షంలో బిజెపి కండువా కప్పేసుకున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అఖిల వైఖరి వల్ల ఆమెకు రోజు రోజుకు రాజకీయ శతృవులు పెరిగిపోతున్నారు. ఒకవైపు అధికార పార్టీలో గంగుల కుటుంబం. మరోవైపు తాజాగా బిజెపిలో చేరిన సోదరులు. అదే సమయంలో టిడిపిలోనే తనంటే పడన ఏవి సుబ్బారెడ్డి, ఎన్ఎండి ఫరూక్ తదితరులతో పోరాటం చేయాల్సొస్తోంది. తన స్ధాయిని అఖిల చాలా ఎక్కువ ఊహించుకోవటంతోనే సమస్యలు వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.