Nara Lokesh: కర్ణాటక రాష్ట్రంలోని సింధనూరులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని, తెలుగు ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.
హోసళ్లీ క్యాంపులో నూతనంగా నిర్మించిన శ్రీ కృష్ణదేవరాయ సైనిక పాఠశాలను (Sri Krishnadevaraya Sainik School) మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. యువతలో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడంలో ఇలాంటి విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం స్కూల్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
పాఠశాల వ్యవస్థాపకులలో ఒకరైన దివంగత డాక్టర్ దండమూడి రాధాకృష్ణ స్మారకార్థం నిర్మించిన ‘డా. రాధాకృష్ణ కళాధామ’ ఓపెన్ ఆడిటోరియంను లోకేష్ వర్చువల్గా ప్రారంభించారు. అంతకుముందు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

పర్యటనలో మరో ప్రధాన ఘట్టంగా, సింధనూరు – గంగావతి రోడ్డులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రులతో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం స్థానిక తెలుగు ప్రజల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.
తెలుగు సంఘం ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
“ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో సింధనూరు, రాయచూర్ ప్రాంత తెలుగు ప్రజలు అందించిన మద్దతును ఎప్పటికీ మరువలేను.” అని ఆయన పేర్కొన్నారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన కర్ణాటక తెలుగు ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమం అనంతరం స్థానిక తెలుగు సంఘం నాయకులు మంత్రి లోకేష్ను శాలువా మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ పర్యటనలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు, అభిమానులు పాల్గొని లోకేష్కు ఘన స్వాగతం పలికారు.

