అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్ టిడిపికి గుడ్ బై చెప్పి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరినట్లు విశ్వసనీయ సమాచారం. కుమారుడితో కలసి ఆయన జగన్ ను కలుకున్నారని, పార్టీ కండువా కప్పి వారిని జగన్ వైసిపిలోకి ఆహ్వానించినట్లు ప్రచారమవుతూ ఉంది. వివరాలు అందాల్సి ఉంది.
హర్ష కుమార్ మార్చి 17 వ తేదీన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాకినాడ పర్యటనకు వచ్చినపుడు పచ్చ కండువా కప్పుకున్నారు. ఆయనను చంద్రబాబునాయుడు ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమని, తాను బేషరతుగా టిడిపిలో చేరుతున్నానని ప్రకటించారు హర్షకుమార్ .టిడిపి అధినేత ఆదేశిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. అంటే ఎన్నికల్లో పోటీ చేస్తానని అర్థం.
ఆయనకు టిడిపి అమలాపురం లోక్ సభ స్థానం ఇచ్చేందుకు ఒప్పుకుందని అందుకే ఆయన టిడిపిలో చేరారని అంతా అనుకున్నారు.
అయితే, ఆయనకు అమలాపురం టికెట్ రాలేదు. అది బాలయోగి కుమారుడు హరీష్ కు వెళ్లింది.
దీనితో ఇక ఆపార్టీ లో ఉండి, హరీష్ కు ప్రచారం చేయలేక నాలుగు రోజులలోనే టిడిపి నుంచి బయటకు వచ్చారు. ఇపుడు వైసిపిలో చేరారనుకుంటున్నారు. ఆయన్ని కాంటాక్ట్ చేసేందుకు తెలుగు రాజ్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు.
