మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. ఎరక్కపోయి ఇరుక్కుపోయారు ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో. ఆ స్కామ్కి సంబంధించి అచ్చెన్నాయుడికి బెయిల్ మాత్రమే వచ్చింది. ఆ అరెస్టులు, వ్యవహారాల కారణంగా గత అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేకపోయారు. ఈసారి మాత్రం, ఆయన అదనపు కిరీటం పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరవబోతున్నారు. ఆ కిరీటం, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవి. ఈ పదవి ఆయన కోరుకుంటే వచ్చిందా.? బలవంతంగా ఆయన నెత్తి మీద చంద్రబాబు పెట్టిన ముళ్ళ కిరీటమా.? అన్నదానిపై భిన్న కథనాలున్నాయి.
అసెంబ్లీలో అచ్చెన్న పరిస్థితి ఏంటట.?
అసెంబ్లీలో అచ్చెన్నాయుడి వాయిస్ మీద టీడీపీకి చాలా ఎక్స్పెక్టేషన్స్ వుంటాయి. గట్టిగా మాట్లాడగలరు. కాస్తంత విషయ పరిజ్ఞానం కూడా ఎక్కువే. కానీ, ఏం లాభం.? ఆయన మీద అధికారపక్షం ఎడా పెడా మాటల దాడి చేస్తుంటుంది. గతంలో మంత్రిగా వున్నప్పుడు అచ్చెన్న రెచ్చిపోయారు.. అప్పుడు ఆయన అలా రెచ్చిపోతుంటే భరించిన అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అధికారపక్షమైంది.. దాంతో, వైసీపీ నుంచి వచ్చే మాటల దాడిని అచ్చెన్న ఎదుర్కోక తప్పదు. ఈసారి మరింత దారుణంగా ఆయన విమర్శల్ని భరించాల్సి రావొచ్చు.
ఇకపై ‘దొంగా’ అనాలంటే, అచ్చెన ఆలోచించుకోవాల్సిందే.!
అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి మీద ‘దొంగ’ అంటూ విరుచుకుపడిపోయారు గతంలో టీడీపీ నేతలు. ఆ లిస్ట్లో అచ్చెన్నాయుడు కూడా తక్కువేం తిన్లేదు. కానీ, ఈసారి ఆ మాట అనాలంటే, అచ్చెన్న ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే, అచ్చెన్న మీద ఆల్రెడీ వైసీపీ ‘దొంగ’ అనే ముద్ర వేసేసింది. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్లో అరెస్టయి, జైలుకెళ్ళిన వైనంపై శాసన సభ దద్దరిల్లిపోవడం ఖాయం. అనారోగ్యం, కరోనా సాకు చూపి, జైలుని తప్పించుకునేందుకు ఆయన పడ్డ పాట్లు ఇప్పుడు ఖచ్చితంగా చర్చనీయాంశాలవుతాయి.
ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం దొరుకుద్దా.?
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏం మాట్లాడతారు.? అన్నది పక్కన పెడితే, అచ్చెన్న ఏం మాట్లాడతారు.? అన్నదానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ గట్టిగా సాగుతోంది. అసలు అచ్చెన్నకు మాట్లాడే ఛాన్స్ వైసీపీ ఇస్తుందా.? లేదా.? అంటూ వైసీపీ శ్రేణుల్లో సరదాగా బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయట. ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయమై ఏ చిన్న కామెంట్ నెగెటివ్గా చేసినా, సొంత నేలపై తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంత గందరగోళం నడుమ, అచ్చెన్నాయుడు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలు, టీడీఎల్పీ ఉప నాయకుడిగా అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది అత్యంత ఆసక్తికరమైన అంశం.