Kadapa Girl Murder: కడప జిల్లాలోని ఖాజీపేట మండలంలో శుక్రవారం చోటుచేసుకున్న ఒక దారుణ ఉదంతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, తన మాట వినలేదన్న కక్షతో ఒక ప్రేమోన్మాది పాఠశాల విద్యార్థినిని అత్యంత పాశవికంగా హతమార్చాడు.
అసలేం జరిగింది?
ఖాజీపేట మండలం ఆంజనేయకోట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్, అదే మండలానికి చెందిన ఒక బాలికను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని సదరు బాలికపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అయితే, అందుకు ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారిన వెంకటేశ్, బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి: ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కీలక వ్యాఖ్యలు.
“మహిళలు, బాలికల పట్ల ఉన్మాదుల్లా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. సైకోల్లా ప్రవర్తించే వారికి అదే చివరి రోజు అవుతుంది.” ఇంకెవరూ మహిళల వైపు కన్నెత్తి చూడకుండా ఉండేలా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మగ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు.

బాలిక హత్యతో ఆంజనేయకోట్టాలు మరియు బాధిత బాలిక స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

