వైసీపీ అంతర్మథనం! దొరకని పరిష్కారాలు?

గురువారమే శాసన మండలికి మంగళం పాడుతూ శాసన సభ తీర్మానం చేస్తుందని భావింప బడినా వైసిపి అధిష్టాన వర్గం ఎంత అంతర్మథనం సాగించినా పరిష్కారాలు కానరానందున సోమవారానికి నిర్ణయం వాయిదా పడింది. శాసన సభ సోమవారానికి వాయిదా పడటంతో శాసన మండలి భవిష్యత్తు కూడా సస్పెన్స్ లో వుంది. శాసన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ “ఇలాంటి సభ మనకు అవసరమా?” అని చేసిన ప్రకటన పర్యవసానం ఏలా వుంటుందో ఆయన తత్వం ఎరిగిన వారు సులభంగా అర్థం చేసుకోగలరు. వైసిపి ప్రభుత్వానికి చెంది శాసన మండలి కథ కంచికి పోయినట్లే.

అయితే ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలపై భిన్న మైన వాదనలు వినిపిస్తున్నాయి. వైసిపి వర్గాల నుండి ఎట్టి సంకేతాలు వెలువడ లేదు. కాని శాసన సభ మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసినా కేంద్రం పార్లమెంటులో ఆమోదించి రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసేంత వరకు శాసన మండలి ఉనికిలో వుంటుందని టిడిపి నేత ఎనమల రామ కృష్ణుడు చెబుతున్నారు. ఇతర న్యాయ నిపుణులు కూడా అదే అభిప్రాయం చెబుతున్నారు. అంటే ఈ కర్మకాండ అంతా ముగియడానికి సంవత్సరం లోపు పట్ట వచ్చు.అటు ఇటుగా అంతకు లోపు జరగ వచ్చు.

గతంలో ఎన్టీఆర్ 1983 లో శాసన మండలిని రద్దు చేసి కేంద్రానికి పంపితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పక్కన బెట్టారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో రెండవ మారు శాసన సభ తీర్మానం చేసి పంపితే కేంద్రం అంగీకరించిందని చెబుతున్నారు.ఇప్పుడు కేంద్రలోని బిజెపి ప్రభుత్వం సాచివేత వైఖరి అవలంభించితే అంత వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలిని భరించాలసినదే. లేదా తాను గిరి గీసుకున్న పార్టీ ఫిరాయింపులకు చెల్లు చీటి ఇచ్చి మండలిలోని టిడిపి సభ్యులను కొనుగోలు చేయవలసి వుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.ఇందులో ఎంత వరకు విజయం సాధిస్తారో పక్కన బెడితే అదే సమయంలో అప్రతిష్ట మూట గట్టుకోవలసి వుంటుంది. ఇంతకు మించి ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో మార్గం లేదు. అదైనా మున్ముందు మండలికి వెళ్లే బిల్లులకు ఉపకరించుతుంది. గాని సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లుల కోసం ఎంత లేదన్నా మూడు మాసాలు ఆగవలసిదే. ఒక వేళ చట్ట సభలను ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకు వచ్చి ముందుకు వెళ్లాలన్నా సెలక్ట్ కమిటీ పరిశీలనలో వున్న బిల్లులను రద్దు చేసుకొని ఆర్డినెన్స్ తీసుకు రావడం ఎంత వరకు కుదురు తుందో. ఆలా వీలు కాదని కొందరు చెబుతున్నారు.

Current strength in the AP Council

ఇదిలా వుండగా మండలిలో ఏది ఏమైనా 2021 కల్లా 27 స్థానాలు ఖాళీ అవుతాయని అప్పటికి ఇవన్నీ వైసిపి ఖాతాలో పడతాయని చెబుతున్న పూర్వరంగంలో మండలి రద్దయ్యే పక్షంలో పదవులు ఆశించే వైసిపి నేతలు వెంటనే స్పందించక పోవచ్చు. గాని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరంతా బరి తెగించి పోరాడే అవకాశాలు తక్కువగా వుంటాయి. చాప కింద నీరులాగా అసంతృప్తి వ్యాపించే అవకాశమూ లేక పోలేదు. ఇది ఒక రకంగా స్వయం హననం లాంటిదే. ఇవన్నీ అటుంచి ముఖ్యమంత్రి ముందు మరో రెండు సవాళ్లు వున్నాయి. రాష్ట్రంలోని బిజెపి నేతలు మూడు రాజధానుల ప్రతిపాదనను నిఖచ్చిగా వ్యతిరేకిస్తున్నారు. తుదకు ఉత్తరాంధ్రకు చెందిన బిజెపి నేత అమరావతి రైతుల పక్షాన మాట్లాడారు. పైగా పులి మీద పుట్ర లాగా జన సేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరూ కలసి రాజధాని తరలింపుపై ఉద్యమం సాగిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రభావం రాష్ట్ర స్థాయి వరకే పరిమితమౌతుందా? లేక కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా పని చేస్తే మండలి రద్దు బిల్లు ఏదో ఒక వంక పెట్టి పెండింగ్ పెడితే ముఖ్యమంత్రికి మండలి నిద్ర లేని రాత్రులను మిగల్చక తప్పదు. ఇక మిగిలిందల్లా పార్టీ ఫిరాయింపులే.

రాజకీయంగా ఎదురయ్యే అవరోధాలు అటుంచి న్యాయ పరమైన చిక్కులూ తప్పేట్టు లేదు. శాసన సభలో గురువారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజ్యాంగంలో రాజధాని అనే మాట లేదని ముఖ్యమంత్రి ఎచ్చట కూర్చొని పని చేస్తే అదే రాజధాని అని చెప్పారు. ఈ మాటల వెనుక ఎంతో గూఢార్థముంది. మూడు రాజధానుల చట్టాలు పక్కన పెట్టి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ పట్నం తరలించి తను విశాఖ మకాం మార్చి పరిపాలన సాగించ వచ్చనే ధ్వని ఇందులో వుంది. అయితే ఈ విధానానికి గురువారం రోజునే హైకోర్టు గండి కొట్టింది. మూడు రాజధానుల ప్రతిపాదన చట్టం కాలేదు కాబట్టి రాజధాని రైతులు ఇతరులు వేసిన కేసులను ఫిబ్రవరి 26 తేదీకి వాయిదా వేస్తూ ఈ లోపు అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను తరలించితే తిరిగి తీసుకు వచ్చే అధికారం తమకుందని అందుకు వ్యయమయ్యే నిధులు అధికారుల నుండి వసూలు చేస్తామని గట్టి హెచ్చరికలు చేసింది. ఇది కూడా మండలి పరిణామాలు లాగా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ గా భావించ వచ్చు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ సుమూహూర్తాన ఈ ప్రతిపాదన తెర మీదకు తెచ్చారో ఏమో గాని మూడు రాజధానుల అమలుకు గల అన్ని దారులు మూసుకు పోతున్నాయి.

కొసమెరుపుగా ఒక అంశమేమంటే శాసన మండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి చేరలేదని ఈ అంశంలో టిడిపి చేస్తున్న ప్రచారం అంతా వట్టిదేననే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరో విశేషమేమంటే కొందరు ముఖ్యమంత్రికి సరైన సలహాలు ఇవ్వలేదని ఏకంగా గవర్నర్ చేత ఆర్డినెన్స్ ఇప్పించి వుంటే ఈ రాద్ధాంతమంతా వుండేది కాదని వాదిస్తున్నారట. ఇందుకు ప్రత్యర్థులు కొందరు ఒక వేళ గవర్నర్ ఆర్డినెన్స్ ను కేంద్రానికి పంపితే చిక్కువచ్చేదని గుర్తు చేస్తున్నారట. మరి సోమవారానికి ఎన్ని మలుపులు తిరుగుతుందో.

వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు 9848394013