విజయసాయి రెడ్డి, లోకేష్.. స్థాయి మరిచి విమర్శలు !

సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రజలు పరిధులు దాటి మాట్లాడుతున్నారని, వారి ట్వీట్లు అభ్యంతరకరంగా ఉంటున్నాయని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు మాట్లాడుతుంటారు.  కొన్ని సందర్భాల్లో ఈ అంశాన్ని విపరీతంగా పరిగణించి ప్రభుత్వాలు కొందరిపై కేసులు  పెట్టడం, అరెస్టులు చేయడం కూడా జరిగాయి.  అందుకు రంగనాయకమ్మ, ఉండవల్లి అనూషలపై సీఐడీ కేసులే నిదర్శనాలు. 

సోషల్ మీడియాలో తోచింది మాట్లాడితే ఇలా అరెస్ట్ చేస్తారా అంటూ జనం అడిగితే హద్దులు మీరితే అంతే.. వేటు తప్పదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే పవర్ఫుల్ డైలాగులు కొడతారు మన రాజకీయ నాయకులు.  కానీ ఆ రాజకీయ నాయకులే శృతిమించి ట్వీట్లు చేస్తే ఏంటి పరిస్థితి.  ప్రజెంట్ వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారం ఇలానే ఉంది.  ఇద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా కంపు కొట్టే ట్వీట్ల వార్ నడుస్తోంది.  
 
విజయసాయి రెడ్డి మొదటి నుండి లోకేష్ మీద ఎక్కివ ద్రుష్టి పెట్టిన మాట వాస్తవం.  లోకేష్ ప్రస్తావన ఎప్పుడూ తెచ్చినా ఆయన పేరు చెప్పకుండా పప్పు అంటూ మారుపేరు పెట్టి సంభోదిస్తూ వ్యంగ్యాస్త్రాలు వేస్తుంటారు.  ఇలా మారుపేరుతో పిలుస్తూ  వెక్కిరించడం ఒకటి రెండుసార్లయితే ఓకే కానీ అదే పనిగా వెక్కిరించడం సరైన పద్దతి కాదు.  తాజాగా కూడా లోకేష్ ఏపీకి రావడం గురించి ప్రస్తావించిన విజయసాయి రెడ్డి పప్పూ…తప్పు.. నాన్న మీద అలిగేవా ? పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే తప్ప మందలగిరి రానన్నావా? పప్పూ… తప్పు తప్పు..! అంటూ ట్వీట్ వేశారు.  
 
మొదట్లో విజయసాయి వేసే సెటైర్లకు జనం నవ్వుకున్నా ఇప్పుడు మాత్రం నిత్యం ఈ వెక్కిరింపులు ఏంటి, అయినా రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలానేనా మాట్లాడేది అంటూ పెదవి విరుస్తున్నారు.  ఇక లోకేష్ సైతం తక్కువేమీ కాదు.  ఆయన కూడా అప్పుడప్పుడు వైఎస్ జగన్ మీద విపరీతమైన ట్వీట్లు వేస్తుంటారు.  నిన్న శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని ఖండించాలనుకున్న ఆయన పదవి కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి దేవుడి మాన్యాలను వదిలిపెడతాడనుకోవడం అత్యాశే అవుతుంది.  భూములను కాపాడుకునే శక్తి కలియుగ దైవం శ్రీ వారికే ఉంది.  గోవిందా… గోవింద అంటూ ట్వీట్ వేశారు.  
 
ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని విమర్శించేటప్పుడు ఇలా తండ్రి శవం తాకట్టు పెట్టిన వ్యక్తి అంటూ మాట్లాడటం సరికాదు.  శవం తాకట్టు లాంటి పదాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.  విమర్శ ఉంటే రాజకీయంగా ఉండాలి తప్ప వ్యక్తిగత విషయాల జోలికి, అందులోనూ కాలం చేసిన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.  గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలనుకునేవారు ఎవ్వరూ ఇలా చెయ్యరు.  నిన్న వీరిద్దరూ వేసిన ట్వీట్లను చూసిన నెటిజన్లు వీళ్లు పొలిటీషియన్లా లేకపోతే స్కూల్ పిల్లలా.. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వారు ఇలాగేనా మాట్లాడేది అంటున్నారు.