లోకేష్ అజ్ఞానం మరోసారి బయటపడింది

చంద్రబాబునాయుడు పుత్రరత్నం నారా లోకేష్ అజ్ఞానం మరోసారి బయటపడింది. పల్నాడు ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ పెట్టటం కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రను అడ్డుకునేందుకే అంటూ ట్విట్టర్లో ఓ ట్వీట్ పెట్టారు. ఇక్కడే లోకేష్ నెటిజన్లకు మరోసారి అడ్డంగా దొరికిపోయారు.

నిజానికి పోలీసులు 144 సెక్షన్ పెట్టింది పల్నాడు ప్రాంతంలో ఎటువంటి అల్లర్లు జరగకూడదనే. 144 సెక్షన్ కూడా ఇప్పటికిప్పుడు పెట్టింది కాదు. చంద్రబాబు ఆడిన చలో ఆత్మకూరు డ్రామ సందర్భంగా ఆ ప్రాంతంలో ఎటువంటి గొడవలు జరక్కుండా ముందు జాగ్రత్తగానే పోలీసులు చర్యలు తీసుకున్నారు.

గురజాలలో బిజెపి బహిరంగసభకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయటానికి కారణం కూడా 144 సెక్షన్ ఉండటమే. 144 సెక్షన్ ను ఉల్లంఘించేందుకు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రయత్నం చేసిన తర్వాతే పోలీసులు సోమవారం ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం మధ్యాహ్నం కోడెల చనిపోయే కొద్ది రోజుల ముందునుండే పల్నాడు ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారన్న విషయం ఒక్క లోకేష్ కు తప్ప మిగిలిన  అందరికీ తెలుసు. ఇంతచిన్న విషయాన్ని కూడా రాజకీయానికి వాడుకోవటం ఒక్క మందలగిరి మాలోకానికే సాధ్యమంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అవసరమైతే కోడెల అంతిమయాత్ర కోసం పోలీసులతో పర్మిషన్ అడిగితే తాత్కాలికంగా 144 సెక్షన్ ఎత్తేసే అవకాశాన్ని పరిశీలించకుండా బుర్రకేది తోస్తే అది ట్విట్టర్లో పెట్టయటమే లోకేష్ కు తెలిసింది.