రోడ్డుపై వెళుతున్నపుడు పోలీసులు ఆపితే లైసెన్సు, ఆర్సీ, ఇన్స్యూరెన్స్ లాంటి కాగితాలు చూపాలి. బ్యాంకులకు ఇంకెక్కడికైనా వెళితే ఆధార్ కార్డో లేకపోతే ప్యాన్ కార్డో చూపాలి. ఇలా ఒక్కో చోటకు వెళ్ళినపుడు ఒక్కో కార్డు చూపాలంటే నిజంగా జనాలకు పెద్ద సమస్య అనే చెప్పాలి. నిజానికి ఎన్ని కార్డులని జేబుల్లో పెట్టుకుని తిరగాలి ? వీటిల్లో ఏ ఒక్కటైనా పోయిందంటే తిరిగి తెచ్చుకోవటానికి తలకు మించన పనే.
ఈ సమస్యలకు తొందరలో చెక్ పెట్టాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే వన్ నేషన్ వన్ కార్డు విధానం. దేశంలోని పౌరులందరికీ బహుళ ప్రయోజనకర కార్డులను జారీ చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పటం జనాలకు సంతోషాన్నిచ్చేదే.
అమిత్ చెప్పింది అమల్లోకి వస్తే బ్యాంకు ఖతా, పాస్ పోర్టు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డులన్నీ ఉపయోగపడేలా అన్నింటికి కలిపి ఒకే కార్డును ఉపయోగంలోకి తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు అమిత్ చెప్పారు. ఇలా అన్నీ కార్డులు కలిపి ఒకే కార్డులోకి ఎక్కాలంటే డిజిటల్ జనాభా గణన చేయాలంటున్నారు.
2021లో చేయబోయే జనాభా లెక్కల సేకరణను పేపర్ , పెన్ అవసరం లేని రీతిలో చేయాలని డిసైడ్ చేసినట్లు కూడా చెప్పారు. వచ్చే జనాభా లెక్కింపును రూ. 12 వేల కోట్లతో 16 భాషల్లో చేయబోతున్నట్లు కూడా అమిత్ చెప్పారు. కలం, కాగితం అవసరం లేకుండా అంటే…మొబైల్ యాప్ తో చేయబోతున్నారట. సరే కేంద్రం ఎన్నిచెప్పినా పార్టకి ఉపయోగం లేనిదే ఏమి చేయదనే అనుమానాలు ఉన్నాయనికోండి అది వేరే సంగతి.
