జగన్-కేసియార్ కీలక సమావేశం

గోదావరి జలాలను రాయలసీమకు తరలించటమనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.  గోదావరి జలాలను రాయలసీమకు తరలించటం ఎంతవరకూ సాధ్యమో తెలీదు కానీ  ఈ విషయం మాత్రం పదే పదే చర్చల్లో నలుగుతోంది. ఇందులో భాగంగానే రెండోసారి కెసియార్-జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు. ప్రగతి భవన్ లో వీళ్ళిద్దరి భేటిలో రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ ఇంజనీర్లు, నిపుణులు కూడా పాల్గొంటున్నారు.

మొత్తానికి కెసియార్, జగన్ స్నేహం అన్నా భేటీలన్నా ఇటు తెలంగాణాలోని కాంగ్రెస్, బిజెపిలతో పాటు ఏపిలోని టిడిపికి మహా మంటగా తయారైంది. ఇదే కెసియార్ తో ఒకపుడు స్నేహం చేయాలని తెగ ప్రయత్నించారు చంద్రబాబు. అయితే కెసియార్ పట్టించుకోకపోవటంతో చంద్రబాబుకు మండిపోయింది. అంటే  ఈ విషయాలను స్వయంగా చంద్రబాబే చెప్పుకున్నారు లేండి.

తనతో స్నేహం చేయటం ఇష్టపడని, పొత్తు పెట్టుకోవటానికి ససేమిరా వద్దన్నా కెసియార్ అదే సమయంలో జగన్ తో చేతులు కలపటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వీళ్ళిద్దరి భేటిపై విషం చిమ్ముతున్నారు. తన ఎల్లోమీడియా ద్వారా విష ప్రచారం చేయిస్తున్నారు. కెసియార్ చేతిలో జగన్ మోసపోవటం ఖాయమని, ఏపి ప్రయోజనాలను జగన్ తాకట్టు పెడుతున్నారంటు ఒకటే గగ్గోలు పెట్టేస్తున్నారు.

నిజానికి ఒకరి చేతిలో మోసపోవటానికి జగన్ ఏమీ అమాయకుడు కాదు. కాకపోతే కెసియార్ ను మాత్రం నమ్మేందుకు లేదన్నది సత్యం. వీలైనంత వరకు కెసియార్-జగన్ భేటి రెండు రాష్ట్రాలకు లాభదాయకంగా ఉండేట్లు జగన్ చూసుకోవాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుందని మరచిపోకూడదు. అందుకు తగ్గట్లే రాతకోతలుండాలి. అసలు వీలైనంత వరకూ విషయం ఏదైనా కానీండి కెసియార్ తో చేతులు కలపకుండా ఉంటేనే మంచిది. తప్పని పక్షంలో  ఏపి ప్రయోజనాలకే జగన్ పెద్ద పీట వేయాలి.