కూటమి ‘కిమ్’ నిర్ణయాలు… సామాన్యుడి ‘శ్వాస’పై పన్ను!

ఈ ఆధునిక ప్రపంచంలోనూ ఓ నియంత తనదైన పాలనతో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అతడే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. ఉత్తర కొరియాలో తన మార్కు పాలన గురించి కథలు కథలుగా ఆన్ లైన్ లో కథనాలు కనిపిస్తుంటాయి. మరోవైపు… కిమ్ మెదడుకు కాస్త తిమ్మిరి ఎక్కితే చాలు.. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని, ఫలితంగా భూగ్రహంలోని మెజారిటీ భాగం నాశనమైపోతుందని అంటారు.

ఇంతకూ ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే… తాజాగా విశాఖలో కూటమి ప్రభుత్వం తీసుకొంటున్న పలు నిర్ణయాలు.. కిమ్ ని గుర్తుకు తెస్తున్నాయంటూ వైసీపీ నుంచి విమర్శలు వినిపిస్తుండటమే!

అవును… రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా… కూటమి ప్రభుత్వం తలచుకుంటే పన్నులకు కొదవా అని అంటున్నారు విశాఖ వాసులు! తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పెద్దలు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ పేరు మీద తెరపైకి వస్తోన్న పలు వ్యవహారాలు వెరసి.. విశాఖ వాసుల్లో పైన పేర్కొన్న మాటలు ధ్వనిస్తున్నాయని చెబుతున్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ తీసుకుంటున్న కొన్ని “ప్రైవేటు” నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతోన్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు… గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను గతంలో ఎన్నడూ లేని రీతిలో అన్నట్లుగా నిర్మాణాలు చేపట్టగా.. వాటిని ‘పీపీపీ’ ల పేరు చెప్పి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం!

ఇదే సమయంలో… గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది! ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో జీవీఎంసీకి పెద్ద ఎత్తున ఉన్న ఆస్తులను 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేయాలని నిర్ణయించింది! అనుకున్నదే తడవుగా… నగరంలోని స్థలాలు, భవనాలు, పార్కులు, స్టేడియంలు ఇలా అన్నీ లీజుకు ఇచ్చేసిందని అంటున్నారు!

ఇందులో భాగంగా.. సుమారు ఆరు వందల ఎకరాల భూములు, 940 దుకాణాలు పీపీపీ పేరుతో 99 ఏళ్లకు లీజుకు వెళ్లిపోయాయని తెలుస్తోంది. ఇది ప్రజా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే చర్యగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో… తాజాగా ఆ ఎఫెక్ట్ ప్రజలపై పడిపోయింది. దీంతో… కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ప్రజానికం!

ఈ సందర్భంగా మైకుల ముందుకు వచ్చిన వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రభుత్వ పనులపై విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా… ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం, శివాజీ పార్క్‌ వంటి వసతులు వైఎస్‌ జగన్‌ హయాంలో అభివృద్ధి చెందితే… అవి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారితే… వాటిపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం పన్నులు విధిస్తోందని విమర్శిస్తున్నారు.

ఎందుకంటే… విశాఖలో వాకింగ్‌ చేసే పౌరులపై పన్ను విధిస్తోందట కూటమి ప్రభుత్వం! మీరు విన్నది నిజమే… విశాఖలో వాకింగ్‌ చేసే పౌరులపై రూ.720 పన్ను విధిస్తున్నారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది! దీంతో… ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనం కోసం అంతా వాకింగ్‌ ను ప్రోత్సహిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వందల రూపాయల పన్ను విధిస్తూ ప్రజల నడకపైనా తమదైన వసూళ్లకు పాల్పడుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు!

ఇదే సమయంలో… లోకేష్‌ తోడల్లుడు, ఎంపీ భరత్‌ కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అప్పగించిన ప్రభుత్వం.. సామాన్య పౌరుడు పార్కులోకి వెళ్తే మాత్రం పన్ను విధించడం దారుణమని… ఈ ‘వాకింగ్‌ టాక్స్‌’ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.

అదే విధంగా… గతంలో ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు ‘వాకింగ్‌ టాక్స్‌’ పేరుతో మధ్యతరగతి ప్రజలను వేధిస్తోందని విమర్శించారు. తక్షణమే ఈ పన్నును రద్దు చేయాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సామాన్యుడి నడకపై పన్ను వేయడాన్ని తుగ్లక్ చర్యకు పరాకాష్టగా పలువురు అభివర్ణిస్తున్నారు!

దీంతో… సామాన్యుడి శ్వాసపై కూడా పన్ను వేసే స్థాయికి ఈ ప్రభుత్వం బరి తెగించేసిందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

అలా అని ఈ వ్యవహారాలు ఇక్కడితో అయిపోలేదు. తాజాగా జీవీఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలు, విలువైన భవనాలపై పీపీపీ విధానం, దీర్ఘకాలిక లీజుల పేరుతో పడిందని అంటున్నారు. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… ఈ టెండర్ల వ్యవహారాన్ని జీవీఎంసీ ద్వారా కాకుండా.. ‘గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌’ ద్వారా నడిపిస్తున్నారని అంటున్నారు.

ఇక ఈ టెండర్‌ ప్రక్రియలో పొందుపరిచిన నిబంధనలు చూసినవారు.. ఉత్తర కొరియాలోని కిమ్ మార్కు పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. ఎందుకంటే… ఎటువంటి కారణం చూపకుండానే ఏ బిడ్‌ నైనా తిరస్కరించే సర్వాధికారాలు గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ కు ఉండటంతోపాటు… దీనిపై ఏ సంస్థా కోర్టుకు వెళ్లేందుకు గానీ, ఫిర్యాదు చేసేందుకు గానీ వీల్లేదట!

ఈ క్రమంలో వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి.. దేవస్థానం భూముల వరకూ వెళ్లిందని వైసీపీ బలంగా విమర్శిస్తోంది. ఇందులో భాగంగా… సింహాచలం అప్పన్న స్వామి దేవస్థానం భూములను ధార్మిక కార్యక్రమాలకు వాడటానికి బదులు, అందులోని సుమారు 106 ఎకరాలను ప్రైవేటు సంస్థకు అప్పగించారంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తూ భక్తుల మనోభావాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు.

ఇదే సమయంలో… ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అన్ కండిషనల్ సనాతని పవన్ కళ్యాణ్ ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. అప్పన్న స్వామికి అన్యాయం జరుగుతుంటే సనాతని పవన్ కు కనిపించకపోవడం దారుణమని.. తాము చెప్పినా వినిపించుకోకపోవడం ఘోరమని అంటున్నారు. స్వామికే శఠగోపం పెట్టే ఈ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ అడ్డుకోవాలని, బీజేపీ నేతలు కళ్లు తెరవాలని కోరుకుంటున్నారు!

పైన పేర్కొన్న వ్యవహారాలకు సంబంధించి సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. నెటిజన్లు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. దీనిపై ఆన్ లైన్ వేదికగా వివరణ ఇచ్చింది.

ఇందులో భాగంగా.. శివాజీ పార్కులో 5 రూపాయల రుసుం వసూలు చేస్తున్నారని.. మిగతా 180 పార్కులలో ఎలాంటి వాకింగ్ ఫీజు లేదని స్పష్టం చేసింది. అయితే… స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో వాకర్స్ కోసం తాగు నీరు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారని.. దీని నిర్వహణ ఖర్చుల కోసమని 720 రూపాయల రుసుం వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది.