అమరావతి రైతులపై సామాజికవర్గం కార్డు వదిలిన జగన్

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రోద్భలంతోనే గత నెలన్నర రోజులుగా రాజధాని అమరావతి గ్రామాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళన ఒకటి రెండు సందర్భాల్లో టిడిపి కార్యకర్తల ప్రవేశం, ప్రమేయంతో హింసాత్మకంగా మారినా, రైతుల అప్రమత్తమయ్యారు. ఆందోళన వివిధ రూపాల్లో కొనసాగిస్తూనే ఉద్యమం హింసాత్మకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రైతుల ఆందోళనను అవకాశంగా తీసుకున్న టిడిపి నాయకత్వం, సామాజికవర్గం చేతిలో ఉన్న మీడియా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కమ్మ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలు కొంతమేర ఫలించి ఉద్యమంలో ఉన్న మహిళలు సైతం జగన్మోహన్ రెడ్డిని దుర్భాషలాడే పరిస్థితి వచ్చింది. అయితే ఆందోళన చేస్తున్న రైతుల్లో ఎక్కువమంది తమ భూముల్లో ఎక్కువభాగం అమ్ముకున్నారు. సమీకరణలో ప్రభుత్వానికి ఇచ్చింది కొంచమే. ఒకవేళ చంద్రబాబు చెప్పిన ప్రపంచస్థాయి రాజధానిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోయినా తమకు నష్టం ఉండబోదనే అవగాహనకు రైతులు వచ్చారు.

ఇటీవల శాసనసభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రెండు విషయాలను స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. అలాగే రైతులకు చెల్లించే కౌలును చంద్రబాబు అంగీకరించిన 10 సంవత్సరాలనుండి 15 సంవత్సరాలకు పెంచారు. మరోవైపు రైతుకూలీలు చంద్రబాబు చెల్లించిన నష్టపరిహారం 2,500 నుండి 5,000 రూపాయలకు పెంచారు. వీటికి మించి తాను కమ్మ సామాజిక వ్యతిరేకం కాదని, తన రోజువారీ కార్యక్రమాలు చూసే తలశిల రఘురాం, తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న మంత్రి కొడాలి నాని కమ్మ సామాజికవర్గం వారేనని స్పష్టం చేసి రైతులు కొంచెం ఆలోచనలోపడే పరిస్థితి కల్పించారు.

దీనికి కొనసాగింపుగానే శుక్రవారం నాడు పార్టీ నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మందడంలో రైతులు ఆందోళన చేస్తున్న శిబిరాన్ని సందర్శించారు. ఆయన శిబిరం దగ్గరకు వచ్చిన సందర్భంలో రైతులు ఎలాంటి ఆందోళనకు దిగకపోగా రెచ్చగొట్టే నినాదాలిచ్చే ప్రయత్నం చేసిన కొందరు టిడిపి కార్యకర్తలను సముదాయించి ఎంపిని స్వాగతించారు. తమ సామాజికవర్గానికి చెందిన అధికారపార్టీ ఎంపీ తమ శిబిరాన్ని సందర్శించడాన్ని రైతులు స్వాగతించారు. అధికార పార్టీ ఎంపీ కూడా ఈ అవకాశాన్ని సమయానుకూలంగానే వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని, రైతులు స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవచ్చని ఒక సానుకూల సందేశం అందించారు.

ఈ ప్రయత్నం ఓరకంగా విజయవంతం అయిందనే చెప్పాలి. ప్రతిపక్ష టీడీపీ నాయకులు పార్లమెంటు సమావేశాల హడావుడిలో ఉండడం, పైగా శాసనమండలి రద్దు తీర్మానం పార్లమెంటుకు వచ్చే అవకాశాలుండడంతో టీడీపీ నేతలు తమ ద్రుష్టి అటువైపు పెట్టిన సమయంలో అదే సామాజిక వర్గానికి చెందిన స్థానిక ఎంపీని పంపి అధికారపార్టీ రాజకీయంగా మంచి వ్యూహాన్నే అమలు చేసింది. వచ్చింది తమ జిల్లా వాడు, పైగా తమ సామాజికవర్గం నేత కావడంతో రైతులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇలాంటి ప్రయత్నాలు అధికారపక్షం వ్యూహాత్మకంగా అమలుచేస్తే అమరావతి రైతుల ఆందోళన తగ్గే అవకాశాలు లేకపోలేదు. రైతుల కౌలు మరో ఐదేళ్ళు పొడిగించడంతో ఇప్పటికే రైతులు అనేకమంది సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఉద్యమం టిడిపి నేతలు ఆశించినంత తీవ్రస్థాయిలో లేకపోవడం కూడా రైతుల్లో మారుతున్న ఆలోచనలను ప్రతిబింభిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తే అమరావతి అంశం కూడా టిడిపి చేతినుండి జారిపోతుంది. టిడిపి తన ఉనికికోసం ఇంకో కొత్త అంశం తీసుకోవాల్సిందే.