నితిన్ భుజానికి గాయం..అందుకే షూటింగ్ లేటు

‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం తర్వాత.. నితిన్ కొద్ది గ్యాప్ తీసుకుని మరో సినిమా మొదలెట్టారు. ప్లాఫ్ ల్లో ఉన్న నాగశౌర్యకు ‘ఛలో’ వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఓ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్‌లో స్టార్ట్ చెయ్యాలనుకున్నారు . కానీ కాలేదు….దాంతో ప్రాజెక్టు ఆగిపోయిందంటూ రూమర్స్ మొదలయ్యాయి. మరో ప్రక్క సోషల్ మీడియాలో డైరక్టర్ ని, నితిన్ ని .. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటూ, అందరూ అడుగుతున్నారు.

దాంతో అసలు విషయం బయిటపెట్టారు దర్శకుడు. నితిన్ అన్న భుజానికి అయిన గాయం నుండి ఇప్పుడే కోలుకున్నారు, ఎక్సర్‌సైజులవీ చేస్తున్నారు, రష్మిక ఎప్పటిలానే తన షూటింగ్‌లతో బిజీగా ఉంది, స్క్రిప్ట్ ఫైనల్ అవుతోంది, త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం అని ట్వీట్ చేసాడు.

దీంతో, రష్మిక, అయ్యో, నితిన్‌కి గాయం అయ్యిందా, నాకు తెలియదే అంటూ కంగారు పడుతుండగా, నితిన్ ఆమెకి రిప్లై ఇచ్చాడు. హేయ్ రష్మిక, నేనిప్పుడు బాగానే ఉన్నా, షూటింగ్‌లో కలుద్దాం అంటూ, పనిలో పనిగా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెంకీని అడిగాడు నితిన్. దాంతో జనవరిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది.

ఇక మరో ప్రక్క …ఈ చిత్రం టైటిల్ భీష్మ అనే ప్రచారంలోకి ఉంది. అయితే అది కాదని కూడా క్లారిటీ ఇచ్చారు. ‘ఛలో’ అనే రెండు అక్షరాలతో వెంకీ కుడుమల చేసిన చిత్రం మంచి హిట్ అవ్వడంతో.. నితిన్‌తో చేయబోయే చిత్రానికి కూడా రెండక్షరాల టైటిల్‌ని ఫ్యాన్స్ సృష్టించేశారు.

‘భీష్మ’ అనే టైటిల్‌తో ఓ పోస్టర్‌ని కూడా సోషల్ మీడియాలో వదిలారు. ఆ పోస్టర్ నిజంగానే సినిమా టైటిలా అనేట్లుగా ఉండటంతో.. అంతా నితిన్, వెంకీ సినిమా టైటిల్ ‘భీష్మ’ అనే అనుకున్నారు.

కానీ ఆ టైటిల్‌ కాదంటూ తాజాగా దర్శకుడు వెంకీ కుడుముల తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘‘ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టర్ నిజంకాదని, అది ఫేక్ పోస్టర్ అని ఆయన తెలిపారు. మంచి అవుట్‌పుట్ ఎప్పుడూ ఎక్కువ సమయమే తీసుకుంటుంది.

మా నుంచి బెస్ట్‌ అనిపించుకుని బయటికి వచ్చే వరకు.. దయచేసి కాస్త ఓపిక పట్టండి. బయట ప్రచారంలో ఉన్న పోస్టర్స్‌ని నమ్మవద్దు. త్వరలోనే అన్ని వివరాలతో అఫీషియల్‌గా మీ ముందుకు వస్తాం…’’ అని తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది.