ప్రపంచాన్ని గజగజ ఒణికిస్తున్న కరోనా అసలు ఎందుకు పుట్టింది? అంటే అమెరికా- భారత్ పై చైనా – పాకిస్తాన్ కక్ష కట్టి చేసిన జాయింట్ ఆపరేషన్ ఇది అని విశ్లేషిస్తున్నారు. వైరస్ ని పుట్టించి ఈ రెండు దేశాల వెన్ను విరిచేయడమే ధ్యేయంగా జరిగిన కుట్ర ఇది అంటూ ఓ సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే అదంతా నిజమో కాదో తెలీదు కానీ.. వినోద పరిశ్రమ వరకూ చూస్తే అంతకుమించిన ఆసక్తికర కోణం మరొకటి బయటపడింది. అదేమిటీ అంటే.. ఇన్నాళ్లు థియేటర్ సిండికేట్ .. థియేటర్ బిజినెస్ .. రెవెన్యూ అంటూ కొట్టుకునే వాళ్లకు ..సేమ్ టైమ్ నాకు థియేటర్లు దొరకలేదు మొర్రో! అంటూ నానా హైరానా పడిపోయే వాళ్లకు పాఠాలు చెప్పేందుకు కరోనా పుట్టిందని ఫిలింసర్కిల్స్ లో సెటైర్లు పడుతున్నాయి.
అంతేకాదు… డైరెక్ట్ టు హోమ్ ని.. డిజిటల్ ని నియంత్రించాలనుకున్న ఆ నలుగురికి థియేటర్ సిండికేట్ కి పంచ్ వేసేందుకే కరోనా పుట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా కానీ కరోనా పుట్టుకతో ప్రస్తుతం డిజిటల్ వీక్షణ పెరిగి ఓటీటీలు కళకళలాడుతున్నాయి. అమెజాన్- నెట్ ఫ్లిక్స్ ఆదాయం అమాంతం పెరిగింది. వ్యూవర్ షిప్ తో కళకళలాడుతున్నాయి. సేమ్ టైమ్ .. ఇటు టీవీ పరిశ్రమలో ఊహించని పరిణామం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు 24 గంటల వార్తలు అంటూ అల్లాడించిన టీవీ చానెళ్లు.. అలాగే వార్తా పత్రికలు పూర్తిగా క్రైసిస్ లో పడిపోయాయి. పత్రికలతో కరోనా వచ్చేస్తుంది అన్న ప్రచారం ఆ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బ కొట్టింది. మరోవైపు జనం ఇంట్లో ఉండి పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లను ఆదరిస్తుండడం తో వాటి టీఆర్పీ రేటింగులు పెరిగి ఇప్పుడు కళకళలాడుతున్నాయి. థియేటర్లకు వెళ్లేందుకు లాక్ డౌన్ సమస్య ఉంది కాబట్టి ఇంట్లోనే ఇంటిల్లిపాదీ టీవీల్లో సినిమాలు చూస్తున్నారు. ఓటీటీల్లోనూ సినిమాలకు అలవాటు పడిపోయారు. దీంతో మునుముందు థియేటర్ బిజినెస్ కి చిల్లు పడిపోవడం ఖాయం అన్న విశ్లేషణ సాగుతోంది.
ఇకపోతే తెలుగులో మొట్టమొదటగా దూరపు చూపుతో ప్రారంభించిన `ఆహా- తెలుగు ఓటీటీ` యాప్ మాత్రం ఆశించినంత స్పీడ్ చూపించడంలో తడబడడమే గాక టెక్నికల్ సమస్యలతో ఇబ్బందిపడడం అల్లు బాస్ కి ఇబ్బందికరమైన విషయమేనన్న ప్రచారం సాగుతోంది. కంటెంట్ పెంచడం ద్వారా సబ్ స్క్రైబర్లను పెంచుకునే టైమ్ వచ్చింది. అందుకే అరవింద్ ఏం చేయబోతున్నారో అన్న చర్చా సాగుతోంది. కరోనా పాఠాలు టాలీవుడ్ లో మునుముందు చాలా మార్పులు తెచ్చేందుకు ఆస్కారం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాలకు భీభత్సమైన ఆదరణ దక్కుతుండడంతో ఆ కోణంలో ఆలోచించేవాళ్లు టాలీవుడ్ లో పెరుగుతున్నారట. సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజూ పండగే సహా ఇటీవల ఓటీటీలోకి వచ్చిన చాలా సినిమాలకు ఆదరణ పెరగడంతో దానిపై ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. మొత్తానికి ఒక సెక్షన్ మీడియాల్ని పెద్ద దెబ్బ కొట్టిన కరోనా ఇలా ఓటీటీని – డిజిటల్ ని పెంచి పోషించడం ఉత్కంఠ పెంచుతోంది. తస్సాదియ్యా కరోనా… నీ లెక్కే వేరు!
