తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు
తాము పట్టిన కుందేంటికి మూడే కాళ్లు అని వాధించడం కొంత మందికి అలవాటు. దాని వల్లనే పేరు తెచ్చుకున్న వాళ్లూ వున్నారు.. ఆ స్వభావం వల్లే వచ్చిన పేరుని పోగొట్టుకున్న వాళ్లూ వున్నారు. ఎదుటి వారు ఎంత చెప్పినా పట్టుదలతో తాము నమ్మిందే వేదం అని తన మాటే నెగ్గాలని కెరీర్ ప్రారంభం నుంచి తాము నమ్ముకున్న పంథాలోనే పయనిస్తూ బ్లాక్ బస్టర్లను అందిస్తున్న దర్శకులు మన దక్షిణాదిలో చాలా మంది దర్శకులే వున్నారు. అలా తాము నమ్మిన పంథా కారణంగానే దర్శకులుగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తమ కంటూ ప్రత్యేక ముద్రని ఏర్పరచుకున్నారు.
అలా ముందు వరుసలో ఉండే దర్శకుడు మణిరత్నం. తనదైన మార్కు టేకింగ్ తో ఎన్నో మరపురాని ఆణిముత్యాల్ని అందించారు. నాయకన్, ఘర్షణ, రోజా, గీతాంజలి, దళపతి, ఇద్దరు, సఖి, దిల్ సే, మౌనరాగం, అంజలి, యువ, దొంగ దొంగది, బొంబాయి వంటి చిత్రాల్ని ప్రేక్షకులకు అందించారు. తను నమ్మింది మాత్రమే ఈ దర్శకుడికి కథే స్టార్. ఆ తరువాతే ఎవరైనా. ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తూ సినిమాలు చేస్తున్నారాయన. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్… టెక్నాలజీ మాస్టర్గా పేరుతెచ్చుకున్నా తను కూడా ఏ స్టార్ మాటా వినడు. కెరీర్ తొలి నాళ్ల నుంచి ఆయన పంథా అదే. అందుకే ఆయన దక్షిణాదిలోనే గ్రేట్ డైరెక్టర్ అయ్యారు. తెలుగులో తొలి తరంలో దర్శకరత్న దాసరిది ఇదే దారి. రామ్గోపాల్ వర్మ, కృష్ణవంశీ లాంటి సీనియర్లు ఇదే పంథాలో వెళ్లారు.
దర్శకుడే సర్వం అని నమ్మిన దర్శకదిగ్గజం దాసరి. చివరివరకూ దానినే అనుసరించారు. ఇక ఆర్జీవీ, కృష్ణవంశీ ఈ ఇద్దరిలో తాము ఎంచుకున్న పంథాతో ఒకరు పేరు తెచ్చుకుంటే మరొకరు వివాదాల్ని సొంతం చేసుకున్నారు. `బాహుబలి`తో యావత్ ప్రపంచాన్ని తెలుగు సినిమా వైపు తలెత్తి చూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఈ జక్కన్నదీ అదే దారి. తాను నమ్మిందే చేస్తాడు. తను స్టార్ని నమ్మడు కానీ తన కథని, టేకింగ్ని మాత్రమే నమ్ముతాడు. అదే అతన్ని ఈ రోజు ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా నిలబెట్టింది. ఇక శేఖర్ కమ్ముల స్కూల్ ప్రత్యేకం. తన సినిమాలో హీరో ఆకాశంలోంచి జారిపడడు. జనాల్లోంచి వస్తాడు. పక్కింటి అబ్బాయిలా వుంటాడు. ఇదే శేఖర్ కమ్ముల నమ్మిన సిద్ధాంతం. అదే అతన్ని సెన్సిబుల్ డైరెక్టర్గా ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇప్పుడు ఇదే పంథాని యువ దర్శకుడు సందీప్ వంగా అనుసరిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దక్షిణాదిలో తమ మాటే వేదమని మాట వినని మోనార్క్లు చాలా మందే వున్నారు.
