గౌతమ్ మీనన్ సినిమాకి ఎట్టకేలకు డేట్ ఫిక్స్!
తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనేలేదు. లవ్స్టోరీస్ని తెరపై ఎంతో హృద్యంగా, అందంగా ఆవిష్కరించడంలో గౌతమ్ మీనన్ ది ప్రత్యేక శైలి. అది యాక్షన్ ఎంటర్టైనర్ అయినా, రొమాంటిక్ లవ్ స్టోరీ అయినా దాన్ని తనదైన పంథాలో తెరపైకి తీసుకొస్తుంటారు గౌతమ్ మీనన్. అయితే అలాంటి పేరున్న దర్శకుడిని ఓ సినిమా ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. అదే `ఎన్నైనోకి పాయుమ్ తోట`. ఎందుకనో ఇటీవల ఆయనకు టైమ్ కలిసి రావడం లేదు. గత రెండేళ్లుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ధనుష్, మేఘా ఆకాష్ జంటగా నటించారు. మదన్, వెంకట సుబ్రమణియన్, రేష్మ ఘటాలతో కలిసి గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
రెండు నెలల్లో పూర్తవుతుందని భావించిన ఈ సినిమా చిత్రీకరణకే అధిక సమయం తీసుకుంది. 2016 ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభించారు. ఇప్పటికి రెండేళ్లు పూర్తయినా ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రిలీజ్కు నోచుకోవడం లేదు. పలు దఫాలుగా రిలీజ్ డేట్లు మారుతూ వచ్చింది. తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్ ఫైనల్ డేట్ని ఖరారు చేశాడు. ఇటీవల ఓ కాలేజీ ఫంక్షన్లో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ చిత్రం ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ ఇబ్బందులన్నీ తొలగిపోయాయని, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని నవంబర్ 15న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని విడుదల చేయబోతోంది. మరి ఈసారైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేక మళ్లీ డేట్ మారుతుందా అని ట్రేడ్ వర్గాలు డౌట్ రైజ్ చేస్తున్నారు.
