మంచు విష్ణు వేధిస్తున్నాడు: దర్శకుడు ఫిర్యాదు

మంచు విష్ణు తనను మానసికంగా వేధిస్తున్నాడని దర్శకుడు కార్తీక్ రెడ్డి ఆరోపణలు చేసారు. సుశాంత్ హీరోగా నటించిన ‘అడ్డా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యిన కార్తీక్ రెడ్డి.. మంచు విష్ణుతో ‘ఓటర్’ అనే సినిమా చేసారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై, త్వరలో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావటం హాట్ టాపిక్ గా మారింది.

తప్పుడు ఎగ్రిమెంట్‌తో తనను మానసికంగా వేధిస్తున్నారంటూ కార్తీక్ రెడ్డి.. తెలుగు సినీ దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు. తాను రాసుకున్న ఓటర్ కథకీ, మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమాకి ఏమాత్రం సంబంధం లేకపోయినా, అసెంబ్లీ రౌడీని ఓటర్ పేరుతో అడాప్ట్ చెయ్యడానికి, విష్ణు, విజయ్ కుమార్ రెడ్డి కలిసి తనతో బలవంతంగా అగ్రిమెంట్ చేయించుకున్నారని కార్తీక్ రెడ్డి చెప్తున్నాడు.

కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి, నేను రాసుకొన్న ఓటర్ సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. అసెంబ్లీ రౌడీని ఓటర్ పేరుతో అడాప్ట్ చేయడానికి బలవంతంగా తప్పుడు అగ్రిమెంట్ చేయించుకొన్నారు. నన్ను బెదిరించి మంచు విష్ణు, విజయ్ కుమార్ రెడ్డి ఎగ్రిమెంట్ పేపర్లపై నాతో సంతకాలు చేయించుకొన్నారు అని దర్శకుడు కార్తీక్ రెడ్డి ఆరోపించారు.

మొదట తను ‘పవర్ ఫుల్’ అనే కథ రాసుకుని, రైటర్ అసోషియేషన్‌లో రిజిస్టర్ చేయించాక, విష్టుకి కథ చెప్తే, నచ్చి సినిమా చెయ్యడానికి ముందుకొచ్చాడు.. తర్వాత సినిమా టైటిల్‌ని ఓటర్‌గా మార్చాల్సి వచ్చింది. షూటింగ్ టైమ్‌లో రెండు సీన్లు మార్చమని విష్ణు ఒత్తిడి చేసాడు.. సినిమా నిర్మాణంలో ఫ్రీడమ్ ఇవ్వకుండా, ప్రతీ పనిలో ఇన్ వాల్వ్ అయ్యేవాడు, దీంతో బడ్జెట్ పెరిగిపోయింది.

సినిమా పూర్తయ్యాక సినిమా చూసి, సినిమా బాగా రావడంతో కథ, స్క్రీన్‌ప్లే క్రెడిట్స్ తనకివ్వాలని అడిగాడు, నేను ఒప్పుకోలేదు. బెదిరించాడు.. ఆ బాధ భరించలేకే స్క్రీన్‌ప్లే రైటర్‌గా అతని పేరు వేసాను. సినిమా పూర్తి చెయ్యడానికి చాలా మానసిక క్షోభ అనుభవించాను అన్నారు కార్తీక్ రెడ్డి. ఈ ఇబ్బందుల మధ్య ఓటర్‌ను విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తూంటే… నన్ను బెదిరించి రాయించుకొన్న తప్పుడు ఒప్పంద పత్రాలతో విడుదలకు అడ్డుపడుతున్నారు అని కార్తీక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.