వెంకీ సినిమాపై రూమర్, ఖండించిన సురేష్ బాబు

`ఇంటిలిజెంట్` ప్లాఫ్ త‌ర్వాత వి. వి.వినాయ‌క్ ఏం చేస్తున్నారనేది గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంసంగా మారింది. అప్పటిదాకా న‌ట‌సింహ బాల‌కృష్ణ‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడనుకున్నారు. కానీ ఈ లోగా బాల‌య్య కె.ఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్టు తర్వాత ఎలాగూ బోయ‌పాటి శ్రీను తో ప‌నిచేయ‌నున్నాడు. ఈ రెండు పూర్త‌వ్వ‌డానికి ఎంత కాదనుకున్నా ఏడాది ప‌డుతుంది. దాంతో వినాయ‌క్ కొత్త ప్రాజెక్ట్ ప‌నుల్లో ప‌డి ఉంటాడని మీడియా ఊహించింది.

దాంతో ఏ హీరోతో వినాయిక్ చేసే అవకాసం ఉంటుందో అని ఆలోచించి, వెంకీతో ముడి పెట్టేసారు. వెంకీ, వినాయిక్ కాంబోలో గతంలో లక్ష్మీ టైటిల్ తో ఓ సూపర్ హిట్ రావటంతో ..అదే కాంబో రిపీట్ అవుతుందని రూమర్స్ లేపారు. దాన్ని కొనసాగిస్తూ… త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ విక్ర‌మ్ వేద‌ను తెలుగు వెంక‌టేష్, నారా రోహిత్ హీరోలుగా రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు మీడియాలో నిన్నటి నుంచి వార్తలు మొదలయ్యాయి.

పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించిన‌ మాధ‌వ‌న్ పాత్ర‌లో నారా రోహిత్, గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర చేసిన విజ‌య్ సేతు ప‌తి రోల్ ను వెంకీ కోసం డిజైన్ చేస్తున్న‌ారని అన్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ పై డి.సురేష్ బాబు నిర్మించ‌డానికి ముందుకొచ్చారని అన్నారు. అయితే ఈ విషయాన్ని సురేష్ బాబు ఖండించారు. తన సోదరుడు ప్రస్తుతం వెంకీ మామ సినిమా చేస్తున్నారని, ఆ తర్వాత ప్రాజెక్టు కూడా ఫైనల్ అయ్యిందని..వాటి వివరాలు త్వరలో చెప్తామని అన్నారు. అలాగే విక్రమ్ వేద సినిమా చేయటం లేదని తేల్చేసారు.