తమన్నా ని చూపించి ఓంకార్ బిజినెస్

తమన్నా సీనియర్ హీరోయిన్ అయ్యిపోయింది. దాంతో ఆమెకు యంగ్ హీరోల ప్రక్కన అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో సీనియర్స్ తో సరిపెట్టుకుంటూ, అడపా, దడపా హారర్ సినిమాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది. అలాగని ఆమె పేరు చెప్తే ప్రత్యేకంగా బిజినెస్ అయ్యే పరిస్దితీ లేదు. అయితే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ కావటం, గ్లామర్ ప్రదర్శన, నటనా సామర్ద్యం ఉండటం ఆమెకు కలిసి వస్తున్నాయి. ఇవన్నీ గమనించే ఓంకారన్నయ్య తన తాజా చిత్రంలోకి ఆమెను తీసుకువచ్చాడు.

అయితే అదీ హారర్ చిత్రం కావటం చెప్పుకోదగ్గ విషయం. దాంతో ఎంతవరకూ తమన్నాను తీసుకోవటం ఓంకార్ కు ప్లస్ అవుతుందని అంటున్నారు. బిజినెస్ పరంగా ప్లస్ అవుతుందనే ఆశించే ఓంకార్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.

యాంకర్ గా సక్సెస్ అయ్యి దర్శకుడిగా పరిచయం అయిన ఓంకార్‌ రాజుగారి గది సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. దీంతో అదే జానర్‌లో నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో రాజుగారి గది 2 చిత్రాన్ని తెరకెక్కించిన మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే ట్రెండ్‌ ను కంటిన్యూ చేస్తూ రాజుగారి గది 3ని తెరకెక్కిస్తున్నాడు ఓంకార్‌.

తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుతో స్టార్‌ మా బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ జైన్‌లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. అశ్విన్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.