లతా మంగేష్కర్ అలా షాకిచ్చారు
కళారంగంలో కాపీ క్యాట్ వ్యవహారాలపై సీరియస్గా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నవతరం గాయనీగాయకుల వ్యవహార శైలిపై సీనియర్ గాయని లతా మంగేష్కర్ వేసిన ఓ పంచ్పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకరి క్రియేటివిటీని అనుకరించడం సరి కాదని .. దానిని ప్రతిభ అనలేమని లతాజీ వ్యాఖ్యానించారు. ఒకరు పాడినట్టు గొంతును సవరించుకుంటే ఆ పాట ఎంతో కాలం మనలేదని హెచ్చరించారు. కిశోర్ కుమార్, మహమ్మద్ రఫి, ఆశా భోంస్లే పాటల్ని యథాతథంగా ఆలపిస్తే దానిని క్రియేటివిటీ అనలేమని.. ఎవరికి వారు ప్రత్యేకమైన బాణీ వినిపించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్ గాయనీగాయకుల్ని అనుకరించడం సరైన విధానం కానే కాదని తనదైన సూచన చేశారు.
కోల్ కత రైల్వే స్టేషన్ బయట జీవనం సాగిస్తున్న గాయణి రణు లతా మంగేష్కర్ పాటల్ని అనుకరిస్తూ పాపులరైన సంగతి తెలిసిందే. హిమేష్ రేషమియా సహా పలువురు బాలీవుడ్ లో పాడే అవకాశం కల్పించారు. రణు చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అవ్వడంపైనా జనాల్లో చర్చ సాగుతోంది. అయితే రణును తప్పు పట్టే ప్రయత్నం కాదు కానీ.. రణు పేరుతో తనంటే గిట్టని వాళ్లందరిపై లతాజీ అదిరిపోయే పంచ్ లే వేశారు. సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్ పైనా లతాజీ తనదైన శైలిలో పంచ్ వేయడం ఆసక్తికరం. ఆ ఇద్దరూ ఇతరుల్ని అనుకరించి పాపులరయ్యారని .. వీళ్ల గురించి తెలిసినట్టు నాకు ఇతరుల గురించి తెలీదని వ్యాఖ్యానించడం సంచలనమైంది. అలాగే రీమిక్సుల పేరుతో సీనియర్లు పాడిన వాటిని తిరిగి పాడటం సరికాదని.. తమ సలహా అయినా తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది పాటల్ని ఆలపించిన మేటి గాయనిగా లతాజీకి ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు. నేటి తరానికి ఎన్నో విలువైన సూచనల్ని చేశారనే దీనిని పాజిటివ్ కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
