సంపూ అభిమాని ఆత్మహత్యాయత్నం..సిల్లీ కారణంతో

సంపూ అభిమాని ఆత్మహత్యాయత్నం

‘కొబ్బరిమట్ట’ సినిమానే కాదు…ఆ సినిమాకు సంభందించిన విషయాలుకూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఈ సినిమాను ప్రదర్శించలేదని హీరో సంపూర్ణేష్‌బాబు అభిమాని వీరంగం సృష్టించటం అంతటా సంచలనంగా మారింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ సెల్‌ టవర్‌ ఎక్కాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లె చంద్రా కాలనీలో చోటుచేసుకుంది. మదనపల్లెలో ‘కొబ్బరిమట్ట’ సినిమాను ఏ థియేటర్‌లోనూ ప్రదర్శించడం లేదు.

దీంతో సినిమాను పట్టణంలో ప్రదర్శించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రెడ్డెప్ప అనే అభిమాని మీడియా సమావేశం నిర్వహించాడు. కానీ ఏ పత్రికలోనూ వార్త ప్రచురితం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆదివారం చంద్రా కాలనీ సమీపంలోని సెల్‌ టవర్‌ ఎక్కి సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఘటనా స్థలానికి చేరుకున్నాడు. కానిస్టేబుల్‌ సహాయంతో రెడ్డెప్పను కిందకు తీసుకొచ్చారు. ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఈ విషయమై సంపూర్ణేష్‌బాబు సోషల్‌మీడియాలో స్పందించాడు. ‘దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేసి, మీ తల్లిదండ్రులకు బాధ కలిగించకండి. సినిమా ఇప్పుడు కాకపోతే రెండు రోజుల తర్వాత చూడొచ్చు’ అని ఆయన అభిమానులను ఉద్దేశించి అన్నాడు.