RRR ప్రచారంలో జక్కన్న టీమ్ వైఫల్యం గురించి తెలిసిందే. ప్రతీ పండుగకు ఓ స్పెషల్ ఉంటుందని…పండుగ రోజున తమ సినిమా విశేషాలు వెల్లడించి ట్రీట్ ఇస్తామని రాజమౌళి అండ్ టీమ్ ప్రామిస్ చేసింది. సంక్రాంతి కానుకుగా అనౌన్స్ చేసిన టీమ్ అటుపై వచ్చిన ఏ పండుగను పట్టించుకోలేదు. ఎన్నో పండుగలు వచ్చి వెళ్లాయి కానీ అభిమానులకు మాత్రం ట్రీట్ లేదాయె. తాజాగా నేడు శ్రీరామనవమిని పురస్కరించుకుని ట్రీటిస్తుందని ఎదురు చూసిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సంక్రాంతి ట్రీట్ లానే మళ్లీ హ్యాండ్ ఇచ్చారు. నేడు బాలీవుడ్ స్టార్ అజయద్ దేవగణ్ పుట్టిన రోజు సందర్భంగా తనకు సంబంధించిన మోషన్ పోస్టర్… ఓ వీడియోని విడుదల చేయాలనుకున్నారుట. కానీ చేయలేకపోయామని మళ్లీ మెల్లగా జారుకున్నారు.
సింపుల్ గా అజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి.. అటుపై `సారీ అనేసి సరిపెట్టుకున్నారు. కరోనా వైరస్ కారణంగా మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్..ఇంకా మరికొన్ని పనులు పూర్తి చేయలేకపోయారుట. అందువల్లే విడుదల చేయలేకపోయామని వివరణ ఇచ్చారు. అయితే ఇలా తప్పించుకోవడం జక్కన్న అండ్ కోకి కొత్తేమి కాదు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడానికి పెద్దగా ఇష్టపడరు. పాన్ ఇండియా సినిమా బాహుబలి దగ్గర నుంచి జక్కన్న ఇదే ఐడియాలజీతో ముందుకు వెళ్తున్నారు. ఆ సినిమా తర్వాత జక్కన్న కు వచ్చిన క్రేజ్ తో ఇంకాస్త అతి చేస్తున్నారనే విమర్శలు కొన్ని నెలలుగా తరుచూ సోషల్ మీడియాలో వెలువడుతూనే ఉన్నాయి.
ఆర్ ఆర్ ఆర్ (రామ రౌద్ర రుషితం) విషయంలో ఇప్పటికే జక్కన్నపై మెగా…నందమూరి అభిమానులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా టీజరో..ట్రైలరో రిలీజ్ చేస్తాడనుకుంటే! పాత పోస్టర్ కి కొత్త రంగులేసి పండగ చేస్కోండని పరిపెట్టారు. అప్పటి నుంచి జక్కన్నను నమ్మడం మానేశారు. మరోసారి శ్రీరామనవమి సందర్భంగాను అదే రిపీట్ అయింది. మరి ప్రతీ సారి ఇలా ఎందుకు జరుగుతుందో! వాళ్లకే తెలియాలి. ఇకపోతే టీజర్ ట్రైలర్ కే పనులు పూర్తి కాకపోతే ఇప్పుడున్న కరోనా క్రైసిస్ లో సినిమాని పూర్తి చేస్తారా లేదా? చెప్పినట్టే సంక్రాంతి 2021 కి సినిమా వస్తుందా రాదా? అన్న టెన్షన్ అభిమానుల్లో మొదలైంది. భారీ విజువల్ గ్రాఫిక్స్ సహా ఇంకా చాలా చాలా పనులు చేయాల్సి ఉండగా జక్కన్న ఇప్పుడే ఇలా చేతులెత్తేస్తే ఎలా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
