కొడుకు కోసం మాఫియా వెంటబడ్డ పూరి

తన డైలాగులతో ఓ తరాన్ని ఊపేసి ,హీరోలకు ఇష్టుడైన డైరక్టర్ గా ముద్రపడ్డ రచయిత పూరి జగన్నాథ్ ఇప్పుడు కాస్తంత వెనక పడ్డారు. అయితే కెరీర్ పరంగా వెనకపడ్డారేమో కానీ తన ప్రాజెక్టుల విషయంలో చాలా స్పీడుగా ఉన్నారు. ఓ ప్రక్క హీరో రామ్ తో ఓ చిత్రం చేస్తున్న ఆయన తన కుమారుడు ఆకాష్ కు కూడా ఓ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు.

ఎందుకంటే గతంలో తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ.. మెహబూబా చిత్రం తీశారు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఎంతో మందిని హీరోగా నిలబెట్టిన తను తన కొడుకుని మాత్రం లేపలేకపోయాడనే బాథ ఉంది. అప్పటికి పూరి తన కుమారుడిని హీరోగా బాగానే ప్రమోట్ చేశాడు.కానీ జనాల్లోకి వెళ్లలేకపోయిందా సినిమా.

దాంతో ఇప్పుడు మరో సారి తన కొడుకుతో సినిమా మొదలెట్టాడు. పూరి జగన్నాధ్ తనే స్వయంగా అందించిన స్క్రిప్ట్ తో నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ తన రెండో సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ను ఎనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ‘రొమాంటిక్’ అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన ‘గాయత్రీ భరద్వాజ్’ అనే ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని పరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి.