లక్కీ హీరోయిన్స్ ని చేరదీసి రవితేజ సేఫ్ గేమ్

హిట్ సినిమాలో చేసిన హీరో,హీరోయిన్స్ కు, టీమ్ కు వచ్చే క్రేజే వేరు. అందరూ వాళ్లను గోల్డెన్ లెగ్ గా భావించి తమ సినిమాల్లోకు తీసుకుని ఆ అదృష్టాన్ని తాము కొంత షేర్ చేసుకోవాలని భావిస్తూంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది ప్రియాంక జవాల్కర్ విషయంలో. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా రీసెంట్ గా విడుదలై మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ కు ఇప్పుడు ఓ రేంజిలో క్రేజ్ వచ్చేసింది‌. తాజాగా ఈ భామ మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.మాస్ మహరాజ్‌ రవితేజ సినిమాలో హీరోయిన్‌గా ఆమె ఫైనల్‌ అయ్యారన్న టాక్‌ వినిపిస్తోంది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘అమర్‌ అక్బర్ ఆంటొని’తో నిరాశపరిచిన రవితేజ త్వరలో విఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్‌ఫిక్షన్‌ థ్రిల్లర్‌లో నటించనున్నాడు. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్‌ను హీరోయిన్‌గా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయట. మరో హీరోయిన్‌గా ఇప్పటికే పాయల్‌ రాజ్‌పుత్‌ను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఇద్దరు లక్కీ హీరోయిన్స్ తో సేఫ్ గేమ్ ఆడాలని రవితేజ ఫిక్స్ అయ్యారన్నమాట. రవితేజ త‌న‌ కెరీర్ లో తొలిసారిగా సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కే చిత్రంలో నటించబోతున్నారు.

నిర్మాత రామ్ తళ్ళూరి మాట్లాడుతూ… మాస్ మహారాజా రవితేజ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు వి ఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో ఓకే చేసి ప్రాజెక్ట్ ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. రవితేజ గారు ఇప్పటివరకు ట‌చ్ చేయని జాన‌ర్ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

ఓ సైంటిఫిక్ కథలో మొద‌టిసారిగా ర‌వితేజ‌ నటించనున్నారు. మా బ్యానర్ వాల్యు ని మ‌రింత‌ పెంచే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. ఈ చిత్రానికి కొన్ని క్రేజీ టైటిల్స్ అనుకుంటున్నాం. అన్ని వర్గాల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉండనుంది. త్వరలోనే సినిమా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు‌ లోగోని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.